మేడ్చల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లు జరగకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి విజయవంతం చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈనెల 15న స్వాతంత్ర దినోత్సవ సంబరాలను శామీర్పేట కలెక్టరేట్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అదనపు కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తిలకించేందుకు వచ్చే వారితో పాటు ముఖ్య అతిధి, అధికారులు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వచ్చే అతిధికి పోలీస్ గౌరవ వందనంతో పాటు బందోబస్తు ఏర్పాట్లను చూడాలని పోలీస్ శాఖకి సూచించినారు. పెరేడ్ మైదానంలో షామియానా, కుర్చీలు, బారికేడింగ్ ఏర్పాట్లు పర్యవేక్షించాలని, అతిధి ప్రసంగించే చోటుతో పాటు వేదిక వద్ద రంగురంగుల పూలతో అలంకరించాలని ఉద్యానవన శాఖ అధికారులకు తెలిపారు. దీంతో పాటు ఆరోజున విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ట్రాన్స్కో అధికారులకు తెలిపారు. మైక్, సౌండ్ బాక్సులను ఏర్పాటు చేయాలని ఐపిఆర్ అధికారులకు వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులచే దేశభక్తిని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరచిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందచేసేందుకు అన్ని శాఖల అధికారుల వివరాలు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, లా ఆఫీసర్ చంద్రావతి, కలెక్టరేట్ ఏ ఓ రామ్ మోహన్ , పోలీస్ అధికారులు సంబంధిత శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




