స్వాతంత్యం తేవడంలో కాంగ్రెస్‌ది కీలకపాత్ర

కార్యకర్తల కృషి ఫలితంగానే రాష్ట్రంలో అధికారం
గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం
జెండాను ఆవిష్కరించిన పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల కృషి ఫలితంగా అధికారంలోకి వొచ్చామని, రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లి రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలని క్యాడర్‌ను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కోరారు. గురువారం కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పార్టీ జెండాను ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ…రాహుల్‌ గాంధీ త్వరలో చేపట్టే యాత్రను విజయవంతం చేయాలని, ప్రతి కార్యకర్త తమ వంతు సహకారం అందించాలని మహేష్‌ కుమార్‌ వినతి చేశారు. భారత జాతీయ కాంగ్రెస్‌ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్‌ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. 1885 డిసెంబర్‌ 8న బొంబాయిలో 72 మందితో ఏర్పడ్డ జాతీయ కాంగ్రెస్‌ పార్టీ నేడు దేశంలోని 140 కోట్ల ప్రజల హృదయాలను గెలుచుకుందన్నారు. దేశ స్వాతంత్రం కోసం ప్రజల్లో జాతీయ భావాన్ని రేకెత్తించి బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడిరచిన పార్టీ కాంగ్రెస్‌ అని చెప్పుకొచ్చారు.

దేశంలో ప్రజలను ఐక్యం చేసి బ్రిటిష్‌ వారి నుంచి దేశానికి స్వాతంత్యం తేవడంలో కీలకపాత్ర వహించింది కాంగ్రెస్‌ అని అన్నారు. ఎంతో మంది స్వతంత్ర పోరాటంలో భాగస్వాములు అయ్యి కుటుంబాలను, ఆస్తులను త్యాగం చేసి ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గి దేశానికి స్వాతంత్యం తెచ్చారన్నారు. దేశానికి స్వాతంత్య్రం వొచ్చిన కొత్తలో ప్రజలు తీవ్రమైన పేదరికంలో ఉన్నారని తెలిపారు. ఒకవైపు ప్రజలు కనీస అవసరాలు తీర్చడం, మరోవైపు దేశాన్ని పటిష్టం చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలు చేసిన సేవలు ప్రజలు మరవలేరన్నారు. 50 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని ప్రపంచంలో ఒక బలమైన ఆర్థిక పరిపుష్టి గల దేశంగా తీర్చిదిద్దిందని చెప్పుకొచ్చారు. గాంధీ, నెహ్రూల కలయిక ఈ దేశానికి ఎంతో మేలు చేసిందన్నారు. వేలాది మంది త్యాగం, వారి జైలు జీవితం వారి నిస్వార్థ సేవతోనే నేడు మనం స్వతంత్ర దేశంలో అన్ని హక్కులను అనుభవిస్తూ జీవిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 139 ఏళ్లుగా ఈ దేశంలో ఒక పటిష్టమైన పార్టీగా నెలదొక్కుకుందంటే ఆ పార్టీ మూల సిద్దాంతాలు..పార్టీలోని నాయకులు కారణమన్నారు. సోనియమ్మ, పీవీ, మన్మోహన్‌, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు దేశం కోసం నిరంతరం శ్రమించారు. దేశానికి స్వాతంత్యం తెచ్చిన తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షలను తీర్చినా అది కాంగ్రెస్‌ పార్టీ వల్లనే సాధ్యం అయ్యిందని మహేష్‌ గౌడ్‌ చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *