స్వదేశీ సంస్థలపై విదేశీయ పెత్తనం!!

ప్రపంచీకరణ మొదలైన తరువాత ప్రతి అధికార పక్షం అనుసరిస్తున్న విధానం ప్రభుత్వరంగ సంస్థలను పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో అమ్మివేస్తుండడం. అమ్మకాల  డిస్ ఇన్‌వెస్ట్‌మెంట్  వచ్చిన రాబడిని వార్షిక వ్యయం చేస్తున్నారు.  కొన్నేళ్ల తరువాత అమ్మడానికి వీలుగా ప్రభుత్వ రంగ సంస్థ ఒక్కటి కూడ మిగలదు.  అప్పుడు రాబడిలో ఈ మేరకు ఏర్పడే లోటును ఎలా పూడ్చుకుంటారు, నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను  ప్రభుత్వేతర సంస్థలకు అప్పగిస్తారట! మరి..  లాభాలతో నడుస్తున్న కొన్ని  ప్రభుత్వరంగ సంస్థలున్నాయి. వీటిని ఎందుకని విదేశీయ వాణిజ్య సంస్థలకు అప్పగిస్తున్నారని అనేక మంది ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు.

 
మన ప్రభుత్వ పారిశ్రామిక రంగం భాగస్వామ్య పారిశ్రామిక రంగంగా మారుతోంది. ప్రభుత్వ ప్రభుత్వేతర భాగస్వామ్యం- పబ్లిక్ ప్రైవేట్  పార్ట్ నర్‌షిప్- పిపిపి- గురించి దశాబ్దాల  తరబడి పెద్దఎత్తున ప్రచారం జరిగింది.  ఈ ‘పిపిపి’ పథకాల స్వరూప స్వభావాలు సామాన్యులకు అర్థం కావు. అర్థమయినట్టయితే పథకాల గొప్పదనం ఏముంది? అందువల్ల మాన్యులు మహనీయులు ఆర్థిక నిపుణులు వివరించాలి.  కానీ గొప్ప గొప్ప ఆర్థికవేత్తలు పరస్పర ‘వికర్షణ’ను ఆవిష్కరిస్తుండడం నడచిపోతున్న విచిత్ర ప్రహసనం.  ‘ప్రభుత్వరంగం’ ఇలా ‘భాగ  స్వామ్య రంగం’గా మారుతుండడం ‘ఆర్థిక ప్రహేళిక’లో సగం మాత్రమే. మిగిలిన సగం- ‘భాగ  స్వామ్య రంగం’ పూర్తిగా ‘ప్రభుత్వేతర రంగం’గా మారిపోవడం, ఇలా మార్పు జరిగిన తరువాత మళ్లీ విప్లవాత్మక పారిశ్రామిక విస్ఫోటనం జరుగుతోంది.  భారతీయ ‘ప్రభుత్వేతర రంగ సంస్థలు’ విదేశీయ సంస్థలకు అమ్ముడుపోతుండడం ఈ విస్ఫోటనం. మన ‘ఆర్థిక వ్యవస్థ’ విదేశీయ వాణిజ్య సంస్థల, బహుళ జాతీయ వాణిజ్య సంస్థల కబంధ బంధంలో చిక్కుకొని పోతోంది.  ఇలా నాలుగు దశలలో ‘‘దేశం విదేశాలకు అమ్ముడుపోతుండడం’’ నాలుగవ దశ, చివరి దశ.  ఈ ప్రక్రియలో ప్రభుత్వరంగ పరిశ్రమలు, భాగస్వామ్య రంగం, ప్రభుత్వేతర రంగం, విదేశీయ సంస్థా నియంత్రిక పారిశ్రామిక, సేవారంగం…’ జిఎమ్‌ఆర్’ అన్న భారతీయ సంస్థ విమానాశ్రయాలను నిర్వహిస్తోంది.
తమ సంస్థ వాటాలలో నలబయి తొమ్మిది శాతాన్ని ‘‘ఐరా పోర్ట్స్ దే పారిస్ సా గ్రూపే’’అన్న ఫ్రాన్స్ సంస్థకు అమ్మిందట… ప్రచారమైంది.  ప్రభుత్వం సొంతంగా విమానాశ్రయాలను నిర్వహించడం గతం… ప్రభుత్వేతర సంస్థలు మన విమానాశ్రయాలను నిర్వహించడం వర్తమానం! విదేశీయ సంస్థల నియంత్రణలో భారతీయుల విమాన ప్రయాణాలు ఇరుక్కొని పోవడం భవిష్యత్తు! ఇదంతా ప్రపంచీకరణ!   భారతీయులు మురిసిపోతున్నారు. అమెరికావారి ‘అమెజాన్’ సంస్థవారు ప్రతిరోజు అత్యధిక శాతం ఇళ్లకు చిత్ర విచిత్రమైన వస్తువులను చేరవేస్తున్నారు.  వినియోగదారులకు మరో పంపిణీ సంస్థ పేరు తెలియదు… ఇదీ విదేశీయ సంస్థల నియంత్రణలో, నిర్దేశంలో మార్గదర్శకత్వంలో కొనసాగుతున్న మన జీవన వ్యవహారం తీరు.  ఎవరు సిగ్గుపడాలి??
‘ఫ్లిప్ కార్ట్’అన్న స్వదేశీయ సంస్థ కొన్నేళ్లు ఇలా వస్తువులను పంపిణీ చేసింది. ‘వాల్‌మార్ట్’అన్న అమెరికా సంస్థ ‘ఫ్లిప్ కార్ట్’ను దిగమింగి వేసింది!  మనకు స్వదేశీయ చరిత్ర గుర్తులేదు, గుర్తు ఉండడం ‘‘సంకుచిత’’ జాతీయతత్త్వం! గుర్తులేకపోవడం ‘‘ప్రపంచీకరణ’’! అందువల్ల ‘ఫ్లిప్ కార్ట్’ కలసిపోయిన తరువాత ‘వాల్‌మార్ట్’ సమగ్రత్వం సిద్ధించడం ‘ప్రపంచీకరణ’ ప్రగతి కథ! ఈ ‘ప్రపంచీకరణ’ను నెత్తికెత్తుకున్నవాడు మన్‌మోహన్‌సింగ్, భారతీయుల ‘‘ఉమ్మడి నెత్తిన’’ ఈ గుదిబండను ప్రతిష్ఠించి వెళ్లాడు! ఈ ‘గుదిబండ’ను నరేంద్ర మోదీ ప్రధానమంత్రిత్వంలోని ‘భారతీయ జనతాపార్టీ’ ప్రభుత్వం మరింత భక్తిశ్రద్ధలతో మోస్తుండడం ప్రవర్థమాన దృశ్యం…
image.png
అనుస్యూతంగా కొనసాగుతున్న ఈ ‘ప్రపంచీకరణ’ ప్రక్రియ ఆర్థిక వ్యవస్థను డొల్లచేస్తోంది!  ‘ప్రపంచీకరణ’ నడికొనేవరకు మన ‘స్థూల జాతీయ ఉత్పత్తి’ సాలీనా ఎనిమిది, తొమ్మిది శాతం ప్రగతిని సాధించింది.  ‘ప్రపంచీకరణ’- మేకులు – మేకల వన్నెల మెకాలు- బలంగా పాదుకొన్న తరువాత మన ‘స్థూల జాతీయ ఉత్పత్తి’- గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్- జిడిపి- పెరుగుదల వేగం మందగించిపోయింది.  ప్రస్తుతం ఈ వేగం నాలుగు శాతం కంటె తక్కువ.  సామాన్యులకు అర్థమయిపోయింది, మేధావులకు ప్రభుత్వ నిర్వాహక ఆర్థిక నిపుణులకు మాత్రం అర్థంకాలేదు… అర్థంకానట్టె అభినయిస్తున్నారన్నది మరో అభిప్రాయం. ప్రపంచీకరణ ప్రారంభమైన నాటికి మన ‘స్థూల జాతీయ ఉత్పత్తి’-జిడిపి- కంటె చైనా ‘స్థూల జాతీయ ఉత్పత్తి’ దాదాపు రెండు రెట్లు… ఇరవై ఐదేళ్ల తరువాత మన ‘జిడిపి’కంటె చైనా ‘జిడిపి’ పరిమాణం నాలుగున్నర రెట్లు… చైనా మనకంటె ఎనిమిదేళ్లు ఆలస్యంగా ‘ప్రపంచీకరణ’ వ్యవస్థ- వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్- ప్రపంచ వాణిజ్య సంస్థలో భాగస్వామ్యం స్వీకరించింది.  మనం విదేశీయుల పెట్టుబడులకోసం దేబిరిస్తున్నాము, చైనా విదేశాలలో భారీగా పెట్టుబడులను పెడుతోంది.  కేవలం పదేళ్ల కాలవ్యవధిలో చైనాకూ మనకూ ‘జిడిపి’ విషయంలో ఇంత అంతరం ఎందుకని ఏర్పడిందన్నది మేధావులు సమాధానం చెప్పవలసిన ప్రశ్న! నిజానికి విదేశీయ సంస్థల పెట్టుబడులు పెద్ద ‘బూటకం’.  ప్రతి సంస్థలోను ‘వాటాల’ను కొంటున్నవారు నిజానికి పెట్టుబడులను అధిక శాతం సమకూర్చుతున్నారు.  విదేశాలనుంచి కూడ ఇలా సంస్థగతమైన పెట్టుబడులను- ఇన్‌స్టిట్యూషనల్ ఇనె్వస్ట్‌మెంట్- మన ప్రభుత్వం వాణిజ్య సంస్థలు సమకూర్చుకోవొచ్చు!  కానీ ప్రత్యక్షపు పెట్టుబడుల- డైరెక్ట్ ఇనె్వస్ట్‌మెంట్-పేరుతో స్వదేశీయ సంస్థల నిర్వహణను నియంత్రణను విదేశీయ సంస్థలు ‘కబ్జా’చేస్తున్నాయి. ఇలా విదేశీయ సంస్థలతో అనుసంధానానికి, అమ్మకానికి, దిగమింగుడుకు గురిఅయిన స్వదేశీయ సంస్థలలో ‘వాటా’ల-స్టాక్ ను కొనుగోలుచేసి లక్షల మంది పెట్టుబడులను సమకూర్చుతున్నారు… పెత్తనం మాత్రం విదేశీయ సంస్థలది!!
ప్రపంచీకరణ మొదలైన తరువాత ప్రతి అధికార పక్షం అనుసరిస్తున్న విధానం ప్రభుత్వరంగ సంస్థలను – పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో- అమ్మివేస్తుండడం! అమ్మకాల  డిస్ ఇన్‌వెస్ట్‌మెంట్  వచ్చిన రాబడిని వార్షిక వ్యయం చేస్తున్నారు.  కొన్నేళ్ల తరువాత అమ్మడానికి వీలుగా ప్రభుత్వ రంగ సంస్థ ఒక్కటి కూడ మిగలదు… అప్పుడు రాబడిలో ఈ మేరకు ఏర్పడే లోటును ఎలా పూడ్చుకుంటారు, నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను -ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ వంటి వాటిని- ప్రభుత్వేతర సంస్థలకు అప్పగిస్తారట! ‘జీవిత బీమా’వంటి లాభాలతో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలున్నాయి. వీటిని ఎందుకని విదేశీయ వాణిజ్య సంస్థలకు అప్పగిస్తున్నారని ప్రముఖులు ఇటీవల ప్రశ్నించారు. సమాధానం లేదు! ప్రభుత్వరంగ సంస్థలు మాత్రమే నష్టాలతో నడుస్తున్నాయనడం వాస్తవ దూరం! దూరవాణి- సంచారవాణి రంగంలోని ప్రభుత్వేతర సంస్థలు నాలుగు లక్షల కోట్ల రూపాయల పన్నులను ఎందుకు చెల్లించలేదు? ప్రభుత్వం ఎందుకు ‘వసూలు’చేయలేదు?? సర్వోన్నత న్యాయస్థానం గట్టిగా హెచ్చరించిన తరువాత మాత్రమే ఈ దూరవాణి ‘సంచారవాణి- టెలికామ్- సంస్థలు వాయిదాల పద్ధతిలో బకాయిలు చెల్లించడం ఆరంభించాయి! ప్రభుత్వేతర సంస్థలు కూడ భారీ నష్టాలతో నడుస్తున్నాయి… వీటిని దిగమింగడం విదేశీయ సంస్థల దీర్ఘకాల వ్యూహం.

-కరిష్మా

 

ఇదీ.. ప్రగతి ప్రహేళిక
* విదేశీ సంస్థల దీర్ఘకాల వ్యూహం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *