సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 24: జాతీయ స్వచ్ఛత క్రానికల్స్ లో సిద్ధిపేట జిల్లాకు చోటు దక్కింది. జిల్లాలోని ములుగు మండలం క్షీరసాగర్, మండల కేంద్రమైన చిన్నకోడూర్ గ్రామాల విజయ గాథలు ప్రచురితమయ్యాయి. ఆదివారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం “స్వచ్ఛత క్రానికల్స్” పేరిట ట్రాన్స్ఫార్మేటివ్ టేల్స్ ఫ్రమ్ ఇండియా’ కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో సంకలనాన్ని ఆవిష్కరించింది. ఈ స్వచ్ఛత క్రానికల్స్ లో మొత్తం 75 సక్సెస్ స్టోరీలు వచ్చాయి. అజాదీ కా అమృత్ 75 వజ్రోత్సవ మహోత్సవంలో భాగంగా దేశంలోని వివిధ గ్రామాలు, జిల్లాలు, ప్రాంతాలలో విజయవంతంగా అమలవుతున్న స్వచ్ఛత, ప్లాస్టిక్, వ్యర్థాల నిర్వహణ, ఇతరత్రా అంశాలను పొందుపరిచింది. వీటిలో సిద్ధిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామపంచాయతీ, కేబీఆర్ ఫౌండేషన్ సహకారంతో ప్లాస్టిక్ వ్యర్ధాలు ఇస్తే బదులుగా వెండి నాణేలు ఇవ్వడంతో ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్మూలనకు విశేషంగా కృషి చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి వినూత్న కార్యక్రమాలతో గ్రామాలను సంపూర్ణ పారిశుద్ధ్య ప్రాణాలుగా మార్చుకోవచ్చునని ఆ విజయగాథలో పేర్కొంది. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ తొలగించేలా ప్లాగ్గింగ్ డ్రైవ్ అంశాలు ప్రస్తావించారు.
సిద్ధిపేట మున్సిపాలిటీ పట్టణంలో చేపట్టిన నడుస్తూ చెత్త, ప్లాస్టిక్ తొలగింపు-ఏరివేద్దాం నినాదంతో మండల కేంద్రమైన చిన్నకోడూర్ గ్రామం స్ఫూర్తి పొంది గ్రామ సంపూర్ణ స్వచ్ఛతకు నాంది పలికిందని ప్రశంసించింది. స్వచ్ఛతకు జిల్లా ముందడుగు వేసేలా నడుస్తూ చెత్త, ప్లాస్టిక్ ఏరివేతకు మంత్రి హరీశ్ రావు ప్రోత్సాహాన్ని, ముందడుగు వేసిన విధానాన్ని వివరించారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో అన్నీ గ్రామాలు స్వచ్ఛతకు బాటలుగా మారుతున్నాయని పేర్కొంది. జిల్లాలోని అన్నీ గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి సంస్థ అమలు పరుస్తున్న విధానాన్ని కూడా ప్రశంసించింది. ఈ మేరకు క్షీరసాగర్, చిన్నకోడూర్ గ్రామ పంచాయతీ పాలక వర్గం, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రధానంగా ప్రజా భాగస్వామ్యంతోనే ఈ స్వచ్ఛత క్రానికల్స్ లో చోటు దక్కడం సంతోషంగా ఉన్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఈ గ్రామాల బాటలోనే జిల్లాలోని మిగతా పల్లెలు స్ఫూర్తి పొంది స్వచ్ఛత బాట పట్టాలని కోరారు. తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహిస్తున్న వర్డ్ ప్రెస్ లో ఇప్పటి దాకా సిద్ధిపేట జిల్లా నుంచి 14 విజయగాథలు ప్రచురితమయ్యాయని జిల్లా అధికార వర్గాలు తెలిపాయి.




