సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 3: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చివరి వరకు ప్రయత్నాలు చేసిన ఢిల్లీ వసంత్ కు టికెట్ దక్కపోవడంతో ఆయన గురువారం రాత్రి స్మశానంలో నిద్రించారు. తాను డిల్లీకి పాదయాత్ర చేయడానికి కారణమైన రైతు సమాధి వద్ద నిద్రించి నిరసన తెలిపారు. చెరుకు రైతుల సమస్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా వసంత్ గతంలో దిల్లీ వరకు పాదయాత్ర చేశారు. అప్పటి నుంచి వసంత్ కాస్తా ఢిల్లీ వసంత్ గా మారారు.ఎల్గోయి గ్రామంలో చెరుకు రైతు చాకలి దశరథ్ ఆత్మహత్య చేసుకున్నారు. తొలుత బీఆర్ఎస్, తర్వాత బీజేపీ నుంచి టికెట్ ఆశించిన వసంత్ కి చివరకు నిరాశే మిగిలింది. దీంతో గురువారం రాత్రి ఆయన రైతు దశరథ్ సమాధి వద్ద రాత్రి నిద్ర, జాగరణ కార్యక్రమం చేశారు.




