• మూడు వేల మంది లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ పత్రాల పంపిణీ
• గృహలక్ష్మి నిరంతర ప్రక్రియ
• నాడు కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లతో వేలకోట్ల రూపాయల అవినీతి..
• మోసపోతే గోసపడతాం.. : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంతింటి కలను సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఒకవైపు మరో వైపు ఖాళీ సొంత జాగా ఉంటే మూడు లక్షల రూపాయల గృహలక్ష్మి పథకాన్ని అందిస్తూ సీఎం కేసీఆర్ పేదల పాలిట ఆత్మబంధువుగా నిలుస్తున్నారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.జిన్నారం మండల పరిధిలోని మాదారం గ్రామంలో గల ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళీ స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని నిరుపేదలకు 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు.
మొదటి విడతలో నియోజకవర్గ వ్యాప్తంగా మూడు వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. మహిళల పేరుపై ప్రొసీడింగ్ పత్రాలు అందజేస్తూ మూడు విడతల్లో డబ్బును అందజేయడం జరుగుతుందని తెలిపారు. పూర్తి పారదర్శకతతో దళారుల ప్రమేయం లేకుండా అర్హులైన వారికి పథకాన్ని వర్తింప చేస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకొని సొంతింటి కలను సాకారం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.గత 65 సంవత్సరాలలో చేయని అభివృద్ధి పదేళ్లలో చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం దేశంలోని అత్యంత అవినీతికి కేంద్రంగా నిలిచాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన వారికే ఇళ్లను కేటాయించి, కోట్ల రూపాయల నిధులను పక్కదోవ పట్టించారని అన్నారు.ప్రజల అభివృద్ధి ,సంక్షేమాన్ని పట్టించుకోని ప్రతిపక్ష పార్టీలు మొసలి కన్నీరు కారిస్తూ బూటకపు హామీలు గుప్పిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ ప్రజలు విజ్ఞులని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని గమనిస్తున్నారని అన్నారు.పటాన్ చెరు నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతూ, అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, లబ్ధిదారులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




