సాహితీ వాచస్పతి దాశరథి నేడు దాశరథి రంగాచార్య వర్ధంతి

తెలుగు జాతి గర్వించదగిన సాహితీవేత్త దాశరథి రంగాచార్య. అయన చేసిన బహుముఖ రచనలు అనన్య సామాన్యాలు. అసాధారణ మేథో సంపత్తికి ప్రతిరూపాలు. రంగాచార్య రచనల్లో తెలంగాణదనం నిండుగా పరుచుకొని ఉంటుంది. ప్రగతి శీల భావం ఉప్పొంగుతుంది. వేద విజ్ఞానం ఆధ్యాత్మికతను తట్టి లేపుతుంది. తెలంగాణ గ్రామీణ జన జీవనం సాక్షాత్కారిస్తుంది. అందుకే తెలంగాణ ప్రజలు, పోరాట యోధులు, తీవ్రవాదులు, పీడిత తాడిత ప్రజలు, నిరంకుశ పాలన బాధితులు, చరిత్రకారులు, చివరకు భాగవతోత్తములు… ఒక్కొక్కరికీ ఒక్కొక్క రీతిలో ఆత్మీయ రచయితగా నిలిచారు.

ఆయన రచయిత, జీవిత చరిత్రకారుడు మాత్రమే కాదు. తెలుగు, సంస్కృతం, ద్రావిడం, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో గొప్ప పండితుడు, కవి, విమర్శకులు, నాటకకర్త. గొప్ప వక్త. ఏ అంశాన్న్కెనా అలవోకగా అవలీలగా వీనులకు ఇంపుగా చెప్పగలిగిన వ్యాఖ్యాత. తొలితరం ఉద్యమ రచయిత, తెలంగాణ అజ్ఞాత సాయుధ పోరాట యోధుడు.

దాశరథి రంగాచార్యులు 1928, ఆగస్టు 24 న నాటి మహబూబా బాదు జిల్లా, చిన్నగూడూర్‌ ‌మండలం, చిన్నగూడూర్‌ ‌లో విద్వాన్‌ ‌వెంకటాచర్య- శ్రీమతి వెంకటమ్మ దంపతులకు జన్మించారు. పుట్టింది పండిత కుటుంబమే అయినా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు దాశరథి. ఆయన అగ్రజుడు దాశరథి కృష్ణమాచార్యుల నుండి అభ్యుదయ, విప్లవ భావాలను అలవర్చుకున్నారు. తెలంగాణ సాయుథ పోరాటంలో ఇద్దరూ కలిసి పనిచేశారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం సర్కార్‌ ‌కు వ్యతిరేకంగా పోరాడారు. తెలంగాణ ఉద్యమ జీవితాన్ని సాహిత్య రూపంలో ప్రజలకు అందించారు రంగాచార్య. తెలంగాణ చరిత్ర, ఉద్యమాలు, ప్రజల జీవితం, సాహిత్యం, సంస్కృతి.. ఇలా తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలను రచనల్లో స్పృశించిన సాటిలేని మేటి రచయిత ఆయన.

ఆయన రచనల్లో పార్శ్వం…

మూడు కావ్యేతిహాసాలను – శ్రీమద్రామాయణము, శ్రీమదాంధ్ర మహాభారతము, శ్రీమద్భాగ వతము, వేదాలు – ఋగ్వేదము, కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము ఓకే ఒక్కరుగా సంస్కృతం నుంచి వ్యాఖ్యాన సహితంగా ప్రతికృతి చేసిన ఏకైక రచయిత దాశరథి. ఆరవ తరగతి చదువుతున్నప్పుడే తోటి విద్యార్థులను కూడగట్టి నిజాంకు వ్యతిరేకంగా సమ్మె చేశారు. నిజాం రాజ్యం ఆచంద్రార్కం నిలిచి ఉండాలని పాఠశాలల్లో చేసే ప్రార్థన, తాను చేయడానికి రంగాచార్య నిరాకరించి, నిబంధన మేరకు వారి లాగే కుచ్చు రూమీ టోపీ ధరించడానికి తిరస్కరించి బడి నుండి బహిష్కృతులు అయినారు. ఎక్కడా చదువు కాకుండా నిజాం ప్రభుత్వం ఫర్మానా జారీ చేసింది కూడా.

పోలీసు నిర్బంధం, చిత్రహింసల నుంచి తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్ళి నిజాం వ్యతిరేక పోరాటం క్రియాశీలంగా జరిపారు. తర్వాత నిజాం ప్రభుత్వం వారంటు జారీ చేసినా, రంగాచార్య జాడ కనుక్కోలేక పోయింది. నేరుగా సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. పగలు బడిలో పిల్లలకు పాఠాలు చెబుతూనే, రాత్రుళ్లు రైతు కూలీలకు ఉద్యమ బోధ చేసేవారు.

తొలి నవల ‘చిల్లరదేవుళ్లు’ను 1969లో వెలువరించారు. ఈ నవల 1974లో చలన చిత్రంగా వచ్చింది. ‘చిల్లరదేవుళ్లు’ 1938కి పూర్వపు తెలంగాణ ప్రజల జీవనాన్ని చిత్రిస్తే, తెలంగాణ సాయుధ పోరాటంలోని 1942-48 సంవత్సరాల మధ్య కాలాన్ని ‘మోదుగు పూలు’ నవల వర్ణిస్తుంది.

చిల్లరదేవుళ్లు’, ‘మోదుగు పూలు’ వంటి నవల్లో తెలంగాణ పలుకుబడులను – నుడికారాన్ని పలికించారు. స్వాతంత్య్రం తరువాత రెండు దశాబ్దాల సుదీర్ఘ కాలాన్ని ‘జనపదం’ నవలలో చిత్రించారు. బుద్ధుని జీవిత చరిత్రను ‘బుద్ధ భానుడు’ పేరుతో అపు రూపమైన రచనను 2010 సంవత్సరంలో వెలువ రించారు.1994లో హరివంశ సహిత ‘మహా భారతం’ రచించారు.1940ల్లో కోల్‌ ‌కతాలో వచ్చిన కరువు రక్కసి గురించి ప్రఖ్యాత భారతీయ ఆంగ్ల రచయిత భవానీ భట్టాచార్య రాసిన నవల He who rides A tigerµ’ను ‘దేవుని పేరిట’ పేరుతో తెలుగులో అనువదించారు. తొలినాళ్ళలో రంగాచార్య పిల్లలకోసం ‘వివేకనందుడు’, ‘మహాత్ముడు’, ‘కాళిదాసు’ అనే మూడు నాటకాలు రచించారు. 1974లో ‘శ్రీ వేంకటేశ్వర లీలలు’ రచించారు.

వేదాలు సామాన్యుడికి సైతం అందించాలనే ఆలోచనతో 70 ఏళ్ళ వయస్సులో బృహత్‌ ‌కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. విస్తృత సాహిత్యాన్ని సరళమైన తెలుగులోకి తేవడం, ముద్రణ, పంపిణీ, వ్యాప్తి కళ్ళార చూడడం రంగాచార్య చేసిన శ్రమఫలం, చేసుకున్న అదృష్టం. ఒక జీవితకాలంలో ఇంత చేసినవారు, ఎదిగినవారు మరొకరులేరు.

తెలంగాణ జీవితాన్ని లోకానికి తెలియ జెప్పాలనే చారిత్రక దృష్టితో, దృఢ సంక్పంతో, తెలంగాణ మీద అభిమానంతో, అందమైన శ్కెలిలో రచనా వ్యాసంగాన్ని ఆయన సాగించారు.

1951లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. తరువాత 1957లో సికింద్రాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌లో చేరి, ఉద్యోగం చేస్తూనే బీఏ, ఎల్‌ఎల్‌బీ చేశారు. 32 సంవత్సరాల పాటు పనిచే చేసి, 1988లో అసిస్టెంట్‌ ‌కమిషనర్‌గా ఉద్యోగ విరమణ చేశారు.

రంగాచార్య 2015 జూన్‌ 8‌వ తేదీన కన్ను మూశారు.

– రామ కిష్టయ్య సంగన భట్ల…

     9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *