హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 15 : ఫ్రెంచ్ కంపెనీ మెరియో సీఈఓ రెమి ప్లెనెట్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం శుక్రవారం పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో భేటీ అయ్యారు. హైదరాబాద్కు చెందిన హెచ్సి రోబోటిక్స్ సౌజన్యంతో సాయుధ దళాల కోసం అధునాతన గింబాల్స్ను తయారు చేసేందుకు రూపొందించిన ప్రణాళికను ప్రతినిధి బృందం మంత్రికి వివరించారు.
భారతదేశంలో మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేయబోతున్న ప్రత్యేకమైన ప్రాజెక్టుకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.వారం రోజుల పాటు భారతదేశ పర్యటనకు వొచ్చిన ఈ బృందం రక్షణ మంత్రిత్వ శాఖ, ఇతర రక్షణ సంస్థల ఉన్నతాధికారులను కలిసి వారి ప్రణాళికలను వివరించారు. ఎయిర్ ఫోర్స్ చీఫ్, వెస్ట్రన్ నేవల్ కమాండ్, ఇండియన్ కోస్ట్ గార్డ్లను సందర్శించారు. హెచ్సి రోబోటిక్స్ బృందంలో సీఈఓ వెంకట్ చుండి, డైరెక్టర్ డాక్టర్ రాధాకిషోర్ ఉన్నారు. ఫ్రెంచ్ బృందంలో మిస్టర్ మాథ్యూ డెస్కోర్స్, టెక్నికల్ మేనేజర్ ,నోయెమీ లాన్సియన్, సేల్స్ మేనేజర్ ఉన్నారు.




