మల్కాజ్గిరి బిజెపి అభ్యర్థిగా పేరు ఖరారుతో అభిమానుల కోలాహలం
మల్కాజ్ గిరి, ప్రజాతంత్ర, మార్చి 03 : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి బిజెపి అభ్యర్ధిగా ఈటల రాజేందర్ పేరును అధినాయకత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈటలకి అభిమానుల తాకిడి ఎక్కువయ్యింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు, ఈటల అభిమానులతో షామీర్ పేటలోని ఈటల నివాసం సందడిగా మారింది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి అభినందనలు తెలిపారు. ఈ సారి గెలుపు మీదే అంటూ భరోసా ఇచ్చారు. శాలువాలు కప్పి సత్కరించారు.
మోదీని ప్రధానమంత్రిని చేసేందుకు మల్కాజ్గిరి నుండి ఈటలను గెలిపించే బాధ్యత తమ భుజ స్కందాల మీద వేసుకుంటామని పలువురు హామీ ఇచ్చారు. నిజాయితీ, నిబద్ధతకు మారు పేరైన ఈటల లాంటి నాయకుణ్ణి ఎంపీ అభ్యర్థిగా ఇచ్చినందుకు నరేంద్రమోదీకి, బీజేపీకి వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం వరకు దాదాపు మూడు వేలకు పైగా అభిమానులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ నరేంద్రుడు, ఇక్కడ రాజేంద్రుడు అంటూ నినాదాలు చేసారు.





