సంఘ సంస్కర్త, దళిత వైతాళికులు, అభ్యుదయవాది

వారి భావజాలం ,ఆలోచన ప్రతి ఒక్కరిలో స్పూర్థి కలిగిస్తూ ఉంటుంది.విద్య ఒక్క ప్రాధాన్యతని వివరించి చరిత్ర పుటలలో తనకూ అంటూ స్థానం సంపాదించుకున్న మేధావి,వక్త,దళిత వైతాళికులు గా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ మే 22, 1888 న జన్మించాడు.  సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు. 1906-1933 మధ్య హైదరాబాద్‌ ‌సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశాడు.  మాదరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు 1888 సంవత్సరం, మే 22వ తేదీన రెండవ సంతానంగా జన్మించిన భాగయ్య, ఆ తర్వాత కాలంలో తన పేరును భాగ్యరెడ్డిగా మార్చుకున్నాడు. 1888 నవంబరులో వారి కుటుంబ గురువు వారిని సందర్శించడానికి వచ్చి పిల్లవానికి భాగయ్యకు బదులు భాగ్యరెడ్డి అని నామకరణం చేశాడు.18 ఏళ్ళ వయసులో భాగ్యరెడ్డికి లక్ష్మీదేవితో వివాహం జరిగింది.భాగ్యరెడ్డి 1906లో షెడ్యూల్డు కులాల బాలబాలికలకు విద్యను నేర్పడం కోసం హైదరాబాద్‌ ‌లోని ఇసామియా బజార్‌ ‌లో జగన్‌ ‌మిత్రమండలి ని స్థాపించాడు.

హరిజనులలో విద్యావశ్యకతను గుర్తించి 1910వ సంవత్సరంలో జగన్‌ ‌మిత్ర మండలి ఆధ్వర్యంలో మొదటి ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు.భాగ్య రెడ్డి వర్మ అంటరాని కులాల ఉద్దరణకై 1911లో మన్య సంఘాన్ని ఏర్పాటుచేశాడు. అప్పటి నుండి జగన్‌ ‌మిత్ర మండలి  కార్యకలాపాలు మన్య సంఘం ద్వారా కొనసాగించాడు.మన్య సంఘం అంటరాని కులాల ప్రజల్లో సాహిత్యం, హరికథలు, ఉపన్యాసాల ద్వారా చైతన్యం తీసుకురావటానికి ప్రయత్నించింది. కొంతమంది ఉన్నత కులాల హిందువులు కూడా ఈ భజన మండళ్లను ప్రోత్సహించారు. మన్య సంఘం ఆధ్వర్యంలో ఈ భజనమండళ్లు రీడింగ్‌ ‌రూములు ఏర్పరచి అందులో ఆంధ్రప్రత్రిక, దీనబంధు మొదలైన పత్రికలను అందుబాటులో ఉంచాయి. ఈ సంస్థ బాల్య వివాహాలను నిర్మూలించడం, దేవదాసి, జోగిని వంటి దురాచారాలు నిర్మూలించడం కోసం పనిచేసింది.

ఈ సంస్థ కృషివల్ల నిజాం దేవదాసి వ్యవస్థను నిర్మూలించాడు. ఒక దశాబ్దం తర్వాత 1921లో మన్య సంఘం  పేరును మార్చి ఆది-హిందూ సోషల్‌ ‌సర్వీస్‌ ‌లీగ్‌ అని నామకరణం చేశారు.1917లో విజయవాడలో భాగ్యరెడ్డి వర్మ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఆంధ్ర పంచమ మహాజన సభ, తొలి ఆది ఆంధ్ర మహాజన సభ గా రూపాంతరం చెందింది. అధ్యక్ష ప్రసంగం చేస్తూ భాగ్యరెడ్డి వర్మ, ఏ హిందూ పురాణేతిహాసాల్లోనూ పంచములనే పదం లేదని, ఈ ప్రాంతానికి మొట్టమొదటి నుండి స్థానికులైన ప్రజలు పంచములే కాబట్టి, ఇప్పటి నుండి ఆది ఆంధ్రులనే వ్యవహారం సరైనదని తీర్మానించాడు. 1917 నుండి 1938 వరకు ఆది ఆంధ్ర మహాసభలు దాదాపు ప్రతి సంవత్సరం జరిగాయి. అంటరానివారిని ఆది హిందువులుగా పిలవాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ ఆది ఆంధ్ర మహాజనసభల ప్రభావంతో 1931 జనాభా లెక్కలలో మాల, మాదిగ, ధేర్‌, ‌చమర్‌ ‌లాంటి వారికి నిజాం ప్రభుత్వం ఆదిహిందువులు గా పేర్కొన్నది.

1933 కల్లా ఆది-హిందూ సోషల్‌ ‌సర్వీస్‌ ‌లీగు ఆధ్వర్యంలో 26 పాఠశాలలు ప్రారంభమయ్యాయి. వీటిలో దాదాపు 2700 మంది విద్యార్థులకు చదువు చెప్పేవారు. ఈయన స్మారకంగా 1943లో ఆయన కొడుకు  గౌతమ్‌ ‌ప్రారంభించిన భాగ్య స్మారక బాలికల పాఠశాలను ఆ తరువాత మనవడు అజయ్‌ ‌గౌతమ్‌ ‌నడిపిస్తున్నాడు.మాల ,మాదిగ సమాన గౌరవం, సమాన భాగం చెందాలని ఆశించిన అరిగే రామస్వామి వంటి మాల నాయకులు, ఇతర నాయకులు భాగ్యరెడ్డి వర్మ ను   మాల పక్షపాతిగా గుర్తించి , 1931లో మాదిగ సంక్షేమం కొరకు అరిగే రామస్వామి అరుంధతియార్‌ ‌మహాసభ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామస్వామి ఇద్దరూ మాల కులస్థులే అయినా, అరిగే రామస్వామి మాల-మాదిగ కులాంతర వివాహాలను ప్రొత్సహించాడు, కానీ భాగ్యరెడ్డి వర్మ అందుకు సమ్మతించలేదు. ఇరువురూ 1920వ దశకం తొలినాళ్ల నుండి అనేక విషయాలపై విభేదించారు. వీరి ఘర్షణకు సైద్ధాంతిక విభేదాలు కంటే, వ్యక్తిగత కారణాలే ప్రధానమైనవని, హైదరాబాదు సంస్థానంలో దళితోద్యమాన్ని గ్రంథస్థం చేసిన పి.ఆర్‌.‌వెంకటస్వామి అభిప్రాయపడ్డాడు.మొదట్లో అర్య సమాజం, బ్రహ్మసమాజం బోధనలను పాటించేవాడు.

బ్రహ్మసమాజం వేదాల  ఆధిక్యతను ప్రశ్నించడం, యజ్ఞోపవితాన్ని త్యజించడం వంటి భావనల వల్ల బ్రహ్మ సమాజం వైపు మొగ్గుచూపాడు అయితే అర్య సమాజంలో చేరిన దళితులకు ఇతర అగ్రకులాల నుండి ఆర్య సమాజం లో చేరిన వారితో సమానంగా గౌరవం లభించడంలేదని గమనించాడు.అర్య సమాజం, బ్రహ్మసమాజం ఏవీ దళితులకు గౌరవాన్ని ఇచ్చేవి కావు అని భావించి బౌద్ధం పట్ల ఆకర్షితుడయ్యాడు. గౌతమ బుద్ధుడు ప్రవచించిన సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ మొదలైన అంశాలపట్ల ఆకర్షితుడయ్యాడు. 1913 నుండి ప్రతి వైశాఖ పూర్ణిమ రోజున బుద్ధ జయంతిని జరుపుకొనేవాడు. తన ఏకైక కుమారునికి గౌతమ్‌ అని పేరు పెట్టుకున్నాడు.బాగయ్య చిన్నప్పటి నుంచే చరిత్ర, విజ్ఞానం పట్ల ఎంతో శ్రద్ధ కనబర్చేవాడు. వీరి ఇంటికి శైవమత గురువు తరుచూ వచ్చి బోధనలు చేసేవారు. ‘ఆర్యులు భారతదేశానికి, ‘మా పూర్వీకులు పాలకులే కదా! నేను పాలకుడిని ఎందుకు కాకూడదు’ అని ఆయన తన పేరు చివరన రెడ్డిని చేర్చుకున్నారు ట. భాగ్యరెడ్డి గా మారాడు.

ఆ తరువాత 1913లో ‘ఆర్య సమాజ్‌’ ‌వార్షిక సదస్సులో ఆయన సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా ‘వర్మ’ అన్న బిరుదును ప్రధానం చేశారు. దాంతో ఆయన భాగ్యరెడ్డి వర్మగా గుర్తింపు పొందారు.ఆధిపత్య కులాల వారు నిర్వహించే వాటికి మాల, మాదిగ లను ఆ కాలంలో రానిచ్చేవారు కాదు. అందుకే భాగ్యడ్డి వర్మ సభలు, సమావేశాల సందర్భంలో హరికథలను నిర్వహించేవారట. అస్పృశ్యతను పాటించే వైదిక ధర్మానికి, వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన బౌద్ధ ధర్మాన్ని పాటించేవారు. వీరు వైశాఖ పౌర్ణమి నాడు బుద్ధ జయంతిని ఘనంగా నిర్వహించేవారు. హరికథా కార్యక్రమాల ప్రారంభంలోను, ముగింపు సమయంలోను భాగ్యడ్డివర్మ దళితుల నుద్దేశించి అనర్గళంగా ప్రసంగించేవారు.

దక్కన్‌లో భాగ్యరెడ్డి వర్మ తరం నిర్మించిన ఆదిజన ఉద్యమం దేశవ్యాపితంగా నడిచిన ఆదిజన మూలవాసీ ఉద్యమానికి అనుసంధాన కర్తగానూ పనిచేసింది. ఇందులో భాగంగానే 1917లో నిర్వహించిన ‘ఆది ఆంధ్ర సభ’లో భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షోపన్యాసం చేయడం చారిత్రాత్మకం. భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన భాగ్యనగర్‌ అనే పత్రికలో సాహిత్యంలో తొలిసారిగా తాను రాసిన నవల వెట్టి మాదిగ సాహిత్యాన్ని తానే తొలిసారి ప్రచురించాడు.వర్మ రాసిన ఆ నవల గురించి ప్రజలకు అంతగా అవగాహన లేదు, కానీ ఆయనే స్వయంగా నవల రాశాడని, ఆ నవల పేరు కూడా ప్రజలకు అంతగా తెలియదు.భాగ్యరెడ్డి వర్మ 1939 ఫిబ్రవరి 18న మరణించారు.వారి జీవితం అందరికి స్ఫూర్తి దాయకం.సమాజ వికాసానికి వారు చేసిన కృషి చిరస్మరణీయం.
– కామిడి సతీశ్‌ ‌రెడ్డి, జడల్‌ ‌పేట, జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *