తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్, 14: తాండూరు పట్టణంలోని పాత కుంట ఆదర్శనగర్ లో వెలసిన శ్రీ కట్ట మైసమ్మ ఆలయంలో గురువారం అమావాస్యని పురస్కరించుకొని భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఏఎంసి మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ శ్రీ కట్ట మైసమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని దానాలలో కెల్లా అన్నదానం గొప్పదని అన్నారు. గత తొమ్మిది నెలలుగా ప్రతి అమావాస్యని పురస్కరించుకొని అమ్మవారి ఆలయ సన్నిధిలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నఅల్లంపల్లి ప్రకాష్ కుమ్మరి నర్సింలు లను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. వారిపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. శ్రీ కట్ట మైసమ్మ భక్తులు కోరుకున్న కోరికలను తీర్చే మహా గొప్ప మహిమగల దేవతా అని, తాండూరు ప్రజలపై అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని అందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లంపల్లి ప్రకాష్ కుమ్మరి నర్సింలు న్యాయవాది దిలీప్ సింగ్ ఠాకూర్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.




