మేడ్చల్ ప్రజాతంత్ర, డిసెంబర్ 23 : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఈనెల 18న హైదరాబాద్ కు శీతాకాల విడిది కోసం భారత వాయుసేన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకొన్న ఆమె పర్యటన శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడ భారత వాయుసేన ప్రత్యేక విమానంలో దేశ రాజధాని ఢిల్లీకి తిరిగి పయనమయ్యారు. రాష్ట్రపతి పర్యటన ముగియడంతో ఆమెకు వీడ్కోలు పలికేందుకు హకీంపేట విమానాశ్రయానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, జిల్లా కలెక్టర్ గౌతమ్, త్రివిధ దళాలకు చెందిన అధికారులు తదితరులు వీడ్కోలు పలికారు.
శీతాకాల విడిది ముగించుకొని ఢిల్లీ బయల్దేరిన రాష్ట్రపతి





