- రాష్ట్రపతికి ఘనంగా స్వాగతించిన గవర్నర్ తమిళి సై, సిఎం కెసిఆర్
- మండలి ఛైర్మన్, స్పీకర్, మంత్రులు, ప్రజాప్రతినిధులను సిఎం కెసిఆర్ పరిచయం
- చాలా కాలం తర్వాత గవర్నర్ తమిళి సైతో సిఎం కెసిఆర్ మాటా మంతీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26 : హైదరాబాద్ విడిది కోసం వొచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం హకీంపేట ఎయిర్బేస్లో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి ఘనస్వాగతం పలికారు. రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికిన వారిలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు ఆర్మీ, నేవీ అధికారులు ఉన్నారు. అనంతరం భారత సైనికుల గౌరవ వందనాన్ని ద్రౌపది ముర్ము స్వీకరించారు. శీతకాల విడిది కోసం ముర్ము ఇవాళ హైదరాబాద్కు వొచ్చారు. 5 రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ముర్ము బస చేయనున్నారు. అంతకు ముందు ఉదయం ఈ పర్యటన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి..ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు.
అక్కడ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం హకీంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది పర్యటన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య చాలాకాలం తర్వాత మాటా మంతీ కలిసింది. ఆ తర్వాత రాష్ట్రపతితో ప్రముఖుల పరిచయ కార్యక్రమంలో కూడా తమిళిసై, కేసీఆర్ ఒకే వేదికపై కనిపించారు. అయితే.. రాష్ట్రపతికి కలిసి స్వాగతం పలికి మాటామంతీ కలిపి కేసీఆర్, తమిళిసై సఖ్యతతో ఉన్నట్లు కనిపించినప్పటికీ రాజ్భవన్లో రాష్ట్రపతికి గవర్నర్ ఇచ్చిన విందుకు మాత్రం కేసీఆర్ దూరంగా ఉన్నారు. హకీంపేట్ నుంచి ఫామ్హౌస్కు సీఎం కేసీఆర్ నేరుగా బయల్దేరి వెళ్లారు.




