రాజస్థాన్ యాత్రలో రాహుల్ వెల్లడి
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, డిసెంబర్ 16 : వొచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఓటమి పాలవుతుందని చెప్పారు. ’రాసి పెట్టుకోండి.. వొచ్చే సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీని కాంగ్రెస్ పార్టీ గద్దె దించుతుంది’ అని వ్యాఖ్యానించారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్తో కలిసి రాహుల్గాంధీ వి•డియాతో మాట్లాడారు. చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు దగ్గరపడటంతో బీజేపీ కుట్రలు మొదలయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని, వ్యక్తిగతంగా తనను అపఖ్యాతిపాలు చేసేందుకు ఒక పద్ధతి ప్రకారం ప్రచారం జరుగుతున్నదని విమర్శించారు. ఇలాంటి చెడగొట్టు ఆలోచనలు బీజేపీకే వొస్తాయని రాహుల్గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సిద్దాంతాలు కలిగిన పార్టీ అని, నియంతృత్వానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడి పోరాటం చేస్తుందని చెప్పారు. అదేవిధంగా రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ వివాదంపై కూడా రాహుల్ స్పందించారు. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. కొన్నికొన్ని సార్లు అపార్థాలు చోటుచేసుకుంటాయని, అది పెద్ద సమస్య కాదని వ్యాఖ్యానించారు.
100 రోజులు..2800 పైగా కిలోమీటర్లు…ఉత్సాహంగా ముందుకు సాగుతున్న రాహుల్ భారత్ జోడో పాదయాత్ర
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపి రాహుల్ గాంధీ దేశ సమైక్యత కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారానికి విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుని ఉత్సాహభరితంగా ముందుకు సాగుతున్నది. ఈ సందర్భంగా జైపూర్లో పార్టీ శ్రేణులు వేడుకలు నిర్వహించారు. ప్రముఖ గాయకునితో మ్యూజికల్ కాన్సర్ట్ ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమయిన యాత్ర ప్రస్తుతం రాజస్థాన్లో కొనసాగుతుండగా ఇప్పటి వరకు 7 రాష్ట్రాలు..తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర మధ్యప్రదేశ్ల మీదుగా సాగింది. ఇప్పటి వరకు 2800 కిలోమీటర్లకు పైగా పాదయాత్రలో రాహుల్ గాంధీ కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ..సూటిగా నిలదీస్తూ..స్థానిక, జాతీయ సమస్యలను వెలుగులోకి తెస్తూ అన్ని వర్టాల దృష్టిని ఆకర్షించారు. దాంతో ఎక్కడిక్కడ అన్ని వర్గాల స్థానిక ప్రముఖులు, భారీ సంఖ్యలో సామాన్య ప్రజలు స్వచ్ఛందంగా పాదయాత్రలో పాల్గొన్నారు.
తన యాత్ర కేవలం ఎన్నికలు, రాజకీయాల కోసం కాదని, కేవలం ప్రజల మధ్య విద్వేశాలను రూపుమాపి దేశాన్ని ఏకం చేయడం, ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న నియంతృత్వ పాలనకు, నిరుద్యోగానికి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని పదేపదే నొక్కి చేపుతూ ముందుకు సాగడం, అన్ని వర్గాల ప్రజలతో ఇట్టే మమేకం కావడం యాత్ర బహుళ ప్రాచుర్యం పొందడానికి కారణమయింది. బిజెపి కార్యాలయాల ముందు నుంచి వెళ్లినప్పుడు కూడా అక్కడి నేతలను, కార్యకర్తలను ఉద్దేశించి ‘ఐ లవ్ యూ..’ అంటూ ముందుకు సాగడం కూడా ఆకట్టుకుంది. కాగా యాత్ర ఇప్పటికే నిర్దేశించిన విధంగా ఇంకా సమారు 50 రోజుల పాటు మరో 750 కిలోమీటర్ల హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, దిల్లీ, పంజాబ్ల మీదుగా కొనసాగి చివరిగా జమ్ము కాశ్మీర్ చేరుకుని కాశ్మీర్లో ముగియనుంది. కాగా శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో రాహుల్ గాంధీ తన పాద యాత్రను దౌసాలోని మీనా హైకోర్ట్ నుంచి ప్రారంభించి 11 గంటలకు గిరిరాజ్ ధరన్ దేవాలయం వద్ద విరామం తీసుకున్నారు. ఉదయం పాదయాత్రలో రాహుల్తో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి సచిన్ పైలట్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుకు, డిప్యూటీ ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో నడిచారు. రాహుల్ సాయంత్రం జైపూర్లో విలేఖరుల సమావేశం నిర్వహించారు.




