యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల రెండోరోజు బుధవారం ధ్వజారోహణం చేపట్టారు. శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారముగా యజ్ఞాచార్యులు ఆధ్వర్యంలో ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, పారాయాణికుల మధ్య కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. వేద స్వరూపుడైన గరుత్మంతుని చిత్రపటాన్ని ధ్వజస్థంభానికి అలంకరించి సకల దేవకోటిని, ప్రాణకోటిని వేంచేయమని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి ఎన్.గీత, ఉప కార్యనిర్వహణాధికారి, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, భక్తులు పాల్గొన్నారు. సాయంతం ఆలయంలో నిత్యారాధనలు, భేరిపూజ, దేవతాఆహ్వానం, హవనము లాంటి కార్యక్రమాలను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యులు వంశీకృష్ణ, హరీశ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను ప్రారంభించారు. కొండపైన ఉన్న బస్టాండ్, కొండకింద ఉన్న కల్యాణ కట్ట వద్ద శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.




