అత్యవసర సమయాల్లో ఉపయోగించే 108, 102తో పాటు, దురదుష్టవశాత్తు చనిపోయిన వారి పార్థీవ దేహాలను ఉచితంగా తరలించే హర్సె వాహనాలు ఎంతో విలువైన సేవలు అందిస్తున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. అయితే కొన్ని వాహనాలకు కాలం చెల్లిపోవడంతో తరుచూ మరమ్మతులకు గురవుతున్నాయని, ఈ నేపథ్యంలో పాత వాహనాల స్థానంలో కొత్తవి సమకూర్చుకోవడంతో పాటు, అవసరమున్నట్లు గుర్తించిన కొత్త ప్రాంతాల్లో వాహనాల సేవలు విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. ఈ మేరకు 466 నూతన వాహనాలు సమకూర్చుకోవడం జరిగిందని, వీటి రాకతో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో మరింత వేగం పెరుగుతుందని, ప్రమాదంలో ఉన్న వారికి అత్యవసర సేవలు వెంటనే అందుతాయని తెలిపారు.
ముఖ్యంగా వైద్య సేవల నిమిత్తం హాస్పిటల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి హాస్పిటల్కి గర్బిణులు, బాలింతలను ఉచితంగా చేర్చే 102 వాహనాలను మరింత సౌకర్యవంతంగా రూపొందించి అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఇవి గర్బిణులు, బాలింతలకు ఎంతో ఉపయోగపడనున్నాయని,. ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలు అందించే విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీపడటం లేదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి వైద్యారోగ్య రంగాన్ని పటిష్టం చేసి, ఆరోగ్య రంగంలో తెలంగాణ దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల మన్ననలను పొందుతుండటం సంతోషకరన్నారు.




