వేములవాడ, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : ఈ సంవత్సరం చివరుకు చేరడంతో రాజన్న సన్నిధికి భక్తుల తాకిడి పెరిగింది. కోడె మొక్కులు తీర్చేందుకు భక్తులు బారులు తీరారు. ప్రతి సోమవారం కోడె మొక్కులు చెల్లించుకుని రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే మంగళ, బుధవారాల్లో కూడా రద్దీ కొనసాగింది. ఈ క్రమంలో భక్తులు భారీగా తరలి వొచ్చి ధర్మగుండంలో స్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పించుకుని క్యూలైన్లలో బారులు తీరారు. కోడెమొక్కును చెల్లించుకుంటున్నారు. ప్రత్యేక అభిషేక పూజలు, అన్నపూజలు, కుంకుమ పూజలు నిర్వహించుకున్నారు.
గండదీపం, పల్లకీసేవలు, పెద్దసేవలు, కల్యాణ మొక్కులను చెల్లించుకున్నారు. మొత్తంగా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం భక్తులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని తరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతి పాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి కల్యాణం, సత్యనారాయణ వ్రతం వంటి అర్జిత సేవల్లో పాల్గొన్నారు. ఆలయ కల్యాణకట్ట సవి•పంలో తలనీలాలు సమర్పించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అసరమైన ఏర్పాట్లు చేశారు.




