పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24: వయోవృద్ధుల సంక్షేమం కోసం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని వాణి నగర్ లో నూతనంగా నిర్మించిన ది నెస్ట్ హోం ఫర్ ది ఏజ్ వృద్ధాశ్రమం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జీవితంలోని చివరి అంకంలో కుటుంబ సభ్యుల నిరాదరణకు గురై వృద్ధాశ్రమంలో చేరే వృద్ధుల ఆలనా పాలనా చూసేందుకు ఆశ్రమాలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోను సొంత నిధులతో వృద్ధాశ్రమం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆశ్రమం నిర్వాహనకు ఐదు లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. భవిష్యత్తులోనూ సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, కౌన్సిలర్ కల్పన ఉపేందర్ రెడ్డి, ప్రముఖ సినీ వ్యాఖ్యాత సుమ కనకాల, నిర్వాహకులు పాల్గొన్నారు.




