- ట్రాఫక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ నత్తనడకన కొనసాగుతున్న పనులు
- రద్దీ సమయంలోనూ పనులతో ప్రజలకు ఇక్కట్లు
- గుంతలు, పనుల నడుస్తున్న చోట కనీసం కానరాని హెచ్చరిక బోర్డులు
- నాయకులు ఫెక్సీలు, బోర్డులు, కార్యక్రమాలతో మరింత అంతరాయం
హైదరాబాదు : అంబర్ పేట రామాంతపూర్ మధ్య, ఆరాంఘర్ నుండి జూ పార్క్ వరకు, ఉప్పల్ చౌరస్తా నుంచి మేడిపల్లి వరకు, ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొత్తూరు వరకు ప్రధాన రహదారులు ప్రతి రోజు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్కు అంతరాయం కలిగేలా గత ఐదు సంవత్సరాలుగా పనులు జరుగుతున్నాయి. భారీ వాహనాలకు ఇదే మార్గం తప్ప వేరే గత్యంతరం లేదు. చక్రం ముందుకు కదలదు, గుంతలు, ప్రమాద హెచ్చరికలు లేని పనులు, ఇనుప చువ్వలు, రద్దీ సమయంలో వెల్డింగ్ పనులతో నిప్పురవ్వలతో ఎప్పుడు అంటుకుంటుందో తెలియని వైనం, రహదారులు నరకప్రాయంగా తయారయ్యాయి. దీనికి తోడు వర్షం పడిందంటే ఏది నాలానో, ఏది మురికి కాలువో తెలియక వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు వెడల్పు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఉప్పల్ చౌరస్తాలో 38 కోట్లు ఖర్చు చేసి ఎనిమిది చోట్ల ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పరచిన ప్రభుత్వం జీబ్రా క్రాస్కు అడ్డంగా బారికేడ్స్ బిగించారు. పాదచారులకు ఇబ్బంది కలుగుతున్నది.
అలాగే ట్రాఫిక్ లైట్లు ఎక్కువసేపు ఉంటున్నాయి. కీలక సమయంలో ఒక్క పోలీసు ఉండరు. ఉప్పల్ బస్ స్టాప్లో షేర్ ఆటోల ఆగడాలు మితిమీరుతున్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పటిష్ట పరచాల్సిన ప్రభుత్వం ఆవైపుగా పట్టించుకున్న పాపాన పోలేదు. పీక్ టైంలో బస్సులు ఉండవు..ఒక వేళ వొస్తే ఒకదాని వెంట ఇంకొకటి మీద మీదకు వొస్తుంటాయి. రోడ్డుకు ఇరువైపులా రెండు మూడు అడుగుల గుంతలు ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. షాపుల కాంప్లెక్స్ల ముందు పేవ్మెంట్ తీసేసారు. మోకాలి లోతు గుంతలు పడ్డాయి. ఇనుప రాడ్లు వాహన చోదకులకు ఇబ్బందిగా మారాయి. వాహనాల వేగం పది కిలోమీటర్ల లోపే ఉండి అప్రమత్తంగా లేకపోతే గాయాలపాలు కావాల్సిందే. ఔటర్ రింగు రోడ్డు ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. ఉప్పల్ రింగ్ రోడ్డు పనులు మొదలుపెట్టి ఏడు సంవత్సరాలు గడిచినా నలభై శాతం పనులు పూర్తి కాలేదు. బ్రిడ్జి నిర్మాణాలు పూర్తి కాక అసంపూర్తిగా ఉన్నాయి. మీర్ ఆలం ట్యాంక్ సమీపంలో పిల్లర్లు వేసి రెండు సంవత్సరాలవుతున్నా దిష్టి బొమ్మలు లాగా ఉన్నాయి తప్ప బడ్జెట్ కేటాయింపులు లేక పనులు జరగడం లేదు.
ఇప్పటికి జరిగిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఎక్కడివక్కడ పనులు నిలిచిపోవడంతో స్తబ్దత నెలకొంది. ఇటీవలి కాలంలో ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. మొన్న జూ పార్క్ దగ్గర యువకుడుతల పగిలి చనిపోయాడు. ఇలా ఎందరో అకాల మరణం పొంది కన్నవారికి కంఠశోకం పెట్టిస్తున్నారు. పోయిన వారిని ఎలాగూ తీసుకురాలేము, ఉన్నవారినైనా కాపాడుదాం అనే ఉద్దేశ్యం అధికారులకు లేదు. ప్రజలు తమ గమ్యానికి వెళ్లాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. చర్లపల్లిలో ఆయిల్ కంపెనీల డిపోలు ఉండటంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. గ్యాస్, ఆయిల్ ట్యాంకర్లు మితిమీరిన వేగంతో నాగారం, రాంపల్లి, చర్లపల్లి, నాచారం, మౌలాలీ ప్రాంతాలలో విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుండి లిటిల్ ఫ్లవర్ కాలేజీ వరకు హనుమకొండ, వరంగల్ ప్రాంతాలకు వెళ్లే బస్సులు డిపోలో నిలిపి ఉంచినట్లు ఉంటుంది. మరోవైపు పోలీసులు సీజ్ చేసిన ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, అధిక లోడ్, ఎప్పుడుపడితే అప్పుడు వొచ్చే వాహనాలను అడ్డుకొని అక్కడే నిలుస్తున్నాయి.
అక్కడే బాబా సాహెబ్ అంబెడ్కర్ విగ్రహం ఉండటంతో ఎప్పుడూ ఎదో ఒక కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. దీనికి తోడు మన నాయకుల జన్మదిన వేడుకలు, పండుగలు, పబ్బాలు, జాతరలతో హబ్సిగూడ నుండి ఎల్బీ నగర్ వరకు అధికారంలో ఉన్నవారు, వారి కుటుంబ సభ్యులు, ద్వితీయ శ్రేణి నాయకులు వారి ముఖాలతో ప్లాస్టిక్ ఫ్లెక్సీలతో దర్శనమిస్తుంటారు. నిండా నిర్లక్ష్యం..దీనికి తోడు ఆర్ అండ్ బిలో సిబ్బంది లేని వైనం..ఉన్న కొద్ది పాటి ఇంజినీర్ల పరిధి ఎక్కువయ్యింది. కనీసం వారానికి ఒక్క రోజైన తనిఖీ చేయాల్సిన అధికారులు రెండు నెలల ఒకసారి రావడం లేదు. ప్రమాదాలు నివారించడానికి హెచ్చరిక బోర్డు ఉండదు, రేడియం స్టిక్కర్ అంటించరు, దగ్గరకు వెళ్ళేంత వరకు రోడ్డు మధ్యలో పెద్ద మట్టి దిబ్బ ఉన్నదని తెలియదు. ప్రమాదం జరిగిన తర్వాత పారితోషికం చెక్కులు ఇవ్వడానికి నగరం నలుమూలల నుండి నాయకులు వస్తారు, ఆ పారితోషికం ఏదో వారి జేబు నుండి ఇస్తున్నట్లు పేపర్లో వార్తలు. నియోజకవర్గంలో రోడ్లు అధ్వాన్నం పరిస్థితిలో ఉన్నాయన్న విషయం స్థానిక శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులకు తెలియదా? వారి నిర్లక్ష్యం వలన విలువైన ప్రాణాలు బలవుతున్నాయి.
చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ పొడిగింపు పనులు నత్తనడకన సాగుతుండడంతో చాంద్రాయణగుట్ట-సంతోష్నగర్ మధ్య మార్గం గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు, చుట్టుపక్కల వాళ్ళకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాంద్రాయణగుట్ట రోడ్డు కొన్నేళ్లుగా రాకపోకలకు అడ్డాగా మారుతుంది. 44వ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ఫ్లైఓవర్ పనులు నెమ్మదిగా సాగుతుండటంతో వేలాది మంది ప్రయాణికులకు శాపంగా మారింది. జాతీయ రహదారిపై రూ.38 కోట్లతో చేపట్టిన చాంద్రాయణగుట్ట ప్రాజెక్టు పనులకు మధ్యలోనే గడువు దాటి పోయింది. చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ చాలా కాలంగా మూతపడటంతో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఒకటిగా ఉన్న హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. మూడు సంవత్సరాలుగా నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయిందని ప్రయాణికులు వాపోయారు. అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని సులభతరం చేసేందుకు ఆగస్టు 16 నుంచి పనులు పూర్తయ్యే వరకు చే నంబర్ జంక్షన్ నుంచి అంబర్పేట్ టి-జంక్షన్ వరకు 400 మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతుంది.
వాహనాల రాకపోకలను అవసరాన్ని బట్టి మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు గోల్నాక మధ్య, జిందా తిలిస్మాత్ మరియు 6 నెం. జంక్షన్ నుండి కూడా అనుమతించబడవు. ద్విచక్ర నాలుగు చక్రాల వాహనాలు అనుమతించారు. ఉప్పల్ నుండి 6 నెంబరు వైపు వచ్చే బస్సులు, భారీ వాహనాలు అంబర్పేట్ టి-జంక్షన్ వద్ద అలీ కేఫ్, జిందా తిలిస్మాత్ గోల్నాక కొత్త వంతెన మీదుగా మళ్లించబడతాయి. నింబోలియాడ్డ తిలక్నగర్ నుండి ఉప్పల్ వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్ను జిందా తిలిస్మత్, అలీ కేఫ్, అంబర్పేట్ టి-జంక్షన్ మీదుగా 6 నంబర్ జంక్షన్ వద్ద మళ్లిస్తారు. చాదర్ఘాట్ నుంచి వచ్చే భారీ వాహనాలను నింబోలియాఅడ్డ వద్ద టూరిస్ట్ హోటల్ వైపు మళ్లిస్తున్నారు. నాగోల్ మెట్రో నుంచి హబ్సిగూడ వరకు ట్రాఫిక్ అంతరాయం నిత్యం జరుగుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. ఇక కంటోన్మెంట్ ఏరియా, తిరుమలగిరి, అల్వాల్ నేరేడ్మేట్, బాలానగర్, హైటెక్ సిటీ, కొత్తగూడ, మదీనాగూడ, మియాపూర్ ఇలా ట్రాఫిక్ జామ్ లేని ప్రాంతమంటూ ఉండదు. మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి పర్మిట్ రూములు, బార్ అండ్ రెస్టారెంట్లకు ఇబ్బడి ముబ్బడిగా పర్మిషన్లు ఇచ్చి వచ్చే సంవత్సరానికి ఈ సంవత్సరమే ఎక్సయిజ్ వేలాలు నిర్వహించి గజానికి నలుగురు పోలీసులను పెట్టి బ్రీత్ అనలైజర్ చేతిలో ఉంచి టార్గెట్లు పెడుతున్నారు. ట్రాఫిక్ను నియంత్రించాల్సిన పోలీసులు తాగుబోతులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రచార ఆర్భాటాలకు చూపిస్తున్న శ్రద్ధ, పనుల వేగవంతం కొరకు పెడితే బాగుంటుంది. లేకపోతే ఎట్లుండే…ఎట్లయిపోయే అని ఫ్లెక్సీలు కట్టాల్సి వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు.




