న్యూ దిల్లీ, ఫిబ్రవరి 10 : విశాఖ రైల్వే జోన్ పై స్పష్టత ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి వెనుకంజ వేసింది. రైల్వే జోన్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఇప్పటికే గుర్తించడం జరిగిందని కేంద్రం తెలిపింది. శుక్రవారం ఆంధ్రప్రదేశ్లో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుపై రాజ్యసభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్ ఈ విధంగా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.జోన్ ఏర్పాటు ఖర్చులపైనా కేంద్రమంత్రి అరకొర సమాధానమే చెప్పారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్పై అతి తక్కువ ఖర్చు అవుతుందని, ఈ ప్రాజెక్టు కోసం ఈ ఆర్థిక సంవత్సరం 2022 – 23లో చేసిన ఖర్చు కేవలం రూ.7.29 లక్షలేనని చెప్పుకొచ్చారు. భూ సర్వే, హెడ్ క్వార్టర్స్ కాంప్లెక్స్ లే అవుట్, నివాస కాలనీ సహా నిర్మాణ కార్యక్రమాలను చేపట్టాలని రైల్వే శాఖను కోరడం జరిగిందని పేర్కొంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక కూడా ఇప్పటికే సంబంధిత కమిటీ సమర్పించిందని కేంద్రం వెల్లడించింది.


