- లేకుంటే రాష్ట్ర ప్రజలను అవమానించడమే
- బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకపోవడమంటే.. రాష్ట్ర ప్రజలను అవమానపరచడమేనని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. నిజాం రాజులకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఎందరో సాయుధ పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించారని..అలాంటి అమరవీరుల త్యాగాలను కేసీఆర్ విస్మరించడం తగదని హితవు పలికారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని హాలిడే ఇన్ హాజలెట్ హోటల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ అధికారంలోకి రాగానే.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు. ఇండియాను భారత్గా ప్రస్తావించాలని కోరిన ఆయన.. ప్రవాస భారతీయులు తమ గ్రామాల అభివృద్ధి కోసం సహకరించాలని సూచించారు. ఇదే విషయంపై ఇటీవల కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సైతం స్పందించారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాల్సిందే నని డిమాండ్ చేశారు. విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలంటూ పోరాటం చేసే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత విమోచన ఉత్సవాలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మజ్లిస్ను సంతృప్తి పరచడానికే..: మజ్లిస్ పార్టీని సంతృప్తి పరిచేందుకే కేసీఆర్ విమోచన ఉత్సవాలను జరపడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్?ఎస్? కలిసి కేందప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన ఉత్సవాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని దుయ్యబట్టారు. గతేడాది కేందప్రభుత్వ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించామని కిషన్రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్? అధికారికంగా విమోచన ఉత్సవాలు చేయడం లేదని ఆరోపించారు. నిజాం అరాచక పాలన నుంచి అప్పటి హైదరాబాద్? సంస్థానం విమోచన సందర్భంగా సెప్టెంబర్? 17న జాతీయ జెండా ఎగురవేశారని వివరించారు.
‘జాతీయ సమైక్యతా దినోత్సవం’గా ఉత్సవాలు..: సెప్టెంబర్ 17వ తేదీని జాతీయ సమైక్యతా దినోత్సవంగా తెలంగాణ ప్రజలు జరుపుకుంటున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ రోజును ఘనంగా ఎక్కడికి అక్కడ సంబురంగా నిర్వహించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసే వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారని కేటీఆర్ వివరించారు. దీంతో పాటు ప్రభుత్వమే పెద్ద ఎత్తున ప్రతి జిల్లా కేంద్రాల్లో నిర్వహించే సంబురాల్లో.. మంత్రులు పాల్గొని జాతీయ జెండాను ఎగురవేస్తారని కేటీఆర్తెలిపారు. బీఆర్ఎస్ శ్రేణులు ఈ జాతీయ సమైక్యతా దినోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జోడెద్దులుగా తీసుకువెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.




