- కోమటిరెడ్డి ఇంట్లో కాంగ్రెస్ సీనియర్ల లంచ్ విటింగ్
- హాజరైన రేవంత్, జానా, ఉత్తమ్, పొన్నాల, షబ్బీర్, సంపత్ తదితరులు
- ఆగస్ట్ నుంచి ప్రజల్లోకి…త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నామన్న కోమటిరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 19 : ఆగస్ట్ నుంచి ప్రజల్లోకి వెళ్తామని, నేతలమంతా చిన్న చిన్న విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా పనిచేస్తామని కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించారు. బుధవారం కోమటిరెడ్డ్డి నివాసంలో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ… వొచ్చే ఐదు మాసాలు కష్టపడి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యుత్పై తన సవాలును ఎందుకు స్వీకరించలేదో మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. లాగు బుక్కుతో 24 గంటల కరెంటుపై ప్రభుత్వ బండారం బయటపెట్టానని తెలిపారు. దాంతో ప్రభుత్వం భయపడి ఇప్పుడు విద్యుత్ సరఫరాను పెంచిందని చెప్పుకొచ్చారు. త్వరలో బస్సు యాత్ర ఉంటుందని,దీనిపై పిసిసితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోమటిరెడ్డి తెలిపారు. ఈ నెల 30 ప్రియాంక సభ ఉంటుందని, మహిళా డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు తెలిపారు.
ఇక రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుందని మండిపడ్డారు. ధరణి తెచ్చి పేదల భూములు లాక్కున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. కోమటిరెడ్డి నివాసంలో లంచ్ వి•ట్ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఒక్కొక్కరుగా ఎంపీ నివాసానికి చేరుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్ థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్, పొన్నాల లక్ష్మయ్య, సంపత్ కుమార్, షబ్బీర్ అలీ తదితరులు కోమటిరెడ్డి ఇంటికి వొచ్చారు. వీరికి శాలువా కప్పి వెంకట్రెడ్డి స్వాగతం పలికారు. కాంగ్రెస్ కీలక నేతల ఈ సమావేశంలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ 2.0పై ప్రధానంగా చర్చించారు. పార్టీలోకి భారీగా చేరికలు ఉండేలా టీపీసీసీ ప్లాన్ చేస్తుంది. అందుకే నేటి సమావేశంలో చేరికలపైనే నేతలు ప్రధానంగా చర్చించారు. ఇక ఈ సందర్భంగా మాజీ మంత్రి పొన్యాల లక్ష్మయ్య మాట్లాడుతూ…రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా 26 పార్టీలు కలిసి ఏకతాటిపైకి వొచ్చాయని అన్నారు.
ఓబీసీ జనగణన చేపట్టాలని రాహూల్ గాంధీ ఇప్పటికే చెప్పారని, బెంగళూరులో జరిగిన విపక్ష పార్టీల సమావేశంలోను ఓబీసీ జనగణనపై చర్చ జరిగిందని ఆయన తెలిపారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన ఇంటికి రమ్మని ఆహ్వానించారని..కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై అందరం కలిసి చర్చిస్తామమని అన్నారు. బుధవారం పొన్నాల లక్ష్మయ్య వి•డియాతో మాట్లాడుతూ… విపక్షాలకు పోటీగా మోదీ ఎన్డిఏ సమావేశాన్ని నిర్వహించారని అన్నారు. రాఫెల్ ఒప్పందంలో ఎంత డబ్బు పెట్టి కొనుగోలు చేశారో మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ చెప్పిన మేకిన్ ఇన్ ఇండియా ఏమైందని ప్రశ్నించారు. దేశ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలన్నారు. మోదీ పాలనలో పోగ్రెస్ ఎక్కడ ఉందో చెప్పాలని అడిగారు.
కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆరోపించారు. ఫిరాయింపుల ద్వారా తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను మోదీ కూల్చారంటూ పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో పలువురు నాయకులు పార్టీలో చేరనున్నారు. గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి తదితరులు దిల్లీలో కాంగ్రెస్లో చేరనున్నారు. బీఆర్ఎస్ అసంతృప్త నేతలతోనూ కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ తదితర నేతలతో చర్చలు జరుగుతుండగా.. త్వరలో వీరంతా కాంగ్రెస్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.




