విచారణ కమిషన్ల తంతు

మనలో బ్రాహ్మణీయ అవగాహన ఎంతగా దిగిపోయి ఉందంటే, ఆచారాలు, క్రతువులు తంతులు ముఖ్యమనీ, మనుషులు ముఖ్యం కాదనీ బ్రాహ్మణ్యం అనుకుంటుంది. మనుషులను పక్కకు తోసేసి, ఆచార వ్యవహరాలకు, మూర్ఖపు పద్ధతులకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు మన ప్రభుత్వాలు కూడా వేర్వేరు ఆచారపు తంతులు నడుపుతూ ఉంటాయి ­. ప్రజలు తిరగబడకుండా, ప్రభుత్వాన్ని విమర్శించకుండా, ప్రభుత్వం చేసేది అర్థం చేసుకోకుండా ఈ తంతులు అడ్డం పడుతూ ఉంటాయి . నిజంగా ప్రజలకు న్యాయం ఇవ్వాలనే ఆలోచనకు మన రాజకీయాల్లో చోటు లేనేలేదు.







  ఆ తర్వాత రెడ్లు ఉన్నారు. మద్రాసు రాష్ట్రంలో కమ్యూనల్‌ జీవో అని వెనుకబడిన కులాల వాళ్లకు అవకాశాలు కల్పించే చట్టం 1930ల నుంచీ అమల్లో ఉంది. అక్కడా చట్టం సహాయంతో బ్రాహ్మణుల ఆధిపత్యం తగ్గించడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆ జివోను కొట్టేశారుగాని దాన్ని కొట్టేసే సమయానికే, రెడ్లు కొంత స్థానం సంపాదించారు. పార్థసారధి రెడ్డి, సంజీవరెడ్డి వగైరా అప్పటికే తయారయి­పోయారు. కమ్యూనల్‌ జీవో వల్ల బ్రాహ్మణేతర అగ్రకులాల ప్రాబల్యం ప్రారంభమయింది .

ఇక వాళ్లు తమకు జడ్జిలుగా ఉండే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని భావించడం మొదలుపెట్టారు. కుల వ్యవస్థ మీద నమ్మకం మనిషిలో ఎటువంటి అభిప్రాయాలు కల్పింస్తుందంటే, నేను అగ్రకులానికి చెందిన వాడిని గనుక నా మెదడు ఇతర వ్యక్తుల మెదడు కన్నా సమర్థంగా పని చేస్తుందనీ, ఇతరులకన్నా నేను ఎక్కువ తెలివైన వాణ్ననీ, నాకు ఎక్కువ సమర్థత ఉన్నదనీ అగ్రకులాలకు చెందిన వ్యక్తులు అనుకునే పరిస్థితి వస్తుంది.

అప్పుడప్పుడు ఎక్కడో ఒక చోట కిందికులాల్లో కూడా సమర్థులు ఉన్నారని ఒప్పుకుంటుంటారు. అది కేవలం ఒక ఉదాహరణంగా చూపడానికి మాత్రమే. ఉదాహరణకు అంబేద్కర్‌ను ఒప్పుకున్నట్టుగా. ఒక ప్రదర్శన వస్తువుగా తయారు చేసి, మా కుల వ్యవస్థ ఎంత ప్రజాస్వామికంగా, ఎంత ఉదారంగా ఉన్నదో చూడండి అని చూపెట్టడానికి వాడుకుంటారు. అం­టే అంబేద్కర్‌ విషయంలో ఆయన కేవలం ఒక ప్రదర్శనా వస్తువుగా మిగిలిపోలేదు. ఆయన కుల వ్యవస్థను సంపూర్ణంగా అర్థం చేసుకుని, దాన్ని ఎత్తిచూపడానికి తన శక్తి మేరకు ప్రయత్నించాడు.

భారతదేశంలో ఒక విచిత్ర స్థితి ఏమంటే, ఎంతో మంది సంఘసంస్కర్తలు పుట్టుకొచ్చారు. వాళ్లలో చాలా మంది కుల వ్యవస్థను విమర్శించారు కూడా. కాని ఈ కుల వ్యతిరేకులైన సంస్కర్తలు కూడా మత వ్యతిరేకులు కారు. వాళ్లు మతాన్ని విమర్శించలేదు.

విచారణ కమిషన్ల తంతు

ఇటువంటి సామాజిక స్థితివల్ల, ఇటువంటి న్యాయ వ్యవస్థ వల్ల, ఎప్పుడైనా, దారుణమారణకాండలు సంభవించినప్పుడు మనకు వాటితో వ్యవహరించడం ఎట్లాగో తెలియదు. ఇక వెంటనే ఒక విచారణ కమిషన్‌ నియమిస్తాము ­. విచారణ కమిషన్‌ నియమించమని ప్రజా ఉద్యమాలు కూడా అడుగుతుంటాయి ­. విచారణ కమిషన్ల చట్టం ఎంత పనికిమాలిన చట్టం అంటే, ఆ కమిషన్‌ విచారణ నివేదిక మీద ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోక పోయినా చేయగలిగేదేమీ లేదు. నిజంగా ప్రభుత్వం ఆ కమిషన్‌ నివేదికను అమలు చేయదలచుకుంటే, ఆ ప్రభుత్వం గనుక చట్టబద్ధపాలన మీద, ప్రజాస్వామ్యం మీద, ఉదారవాద భావాల మీద విశ్వాసం ఉన్నదయి­తే, జరిగిన అన్యాయాన్ని సవరించదలచుకున్నదంయితే, కమిషన్‌ సిఫారసులను తీవ్రంగా పరిగణించవచ్చు. చర్యలు తీసుకోవచ్చు.

అట్లా కాకుండా, ఏదైనా ఒక ఘటన మీద ప్రదర్శనలు ఎక్కువగా జరిగితే, బాధితుల అగ్రహావేశాల మీద చన్నీళ్లు చల్లదలచుకుంటే, వెంటనే ఒక రిటైర్డ్‌ హైకోర్టు జడ్జీ నాయకత్వంలో ఒక కమిషన్‌ను నియమించడం ప్రభుత్వాలకు అలవాటంయి పోయింది. ఆ కమిషన్‌ నియామకం వార్త రాగానే ఆందోళనలు ఆగిపోతాయి ­.

ఇప్పటి వరకూ ఎన్ని కమిషన్లు వేయబడ్డాయో, వాటి సిఫారసులవల్ల మన సామాజిక రాజకీయ వ్యవస్థలో వచ్చిన మార్పులు ఏమిటో పరిశీలిస్తే చాలా దిగ్బ్రాంతికరమైన విషయాలు బయటపడతాయి ­. ఆ నివేదికలన్నీ కలిసి మన రాజకీయ, పాలనా వ్యవస్థల పని తీరును ఏమైనా మార్చాయా? ఏమయి­నా మెరుగుదల కనబడుతుందా? దానివల్ల మన న్యాయ వ్యవస్థలోని సిబ్బంది భావాలలో నియామకాలలో ఏమైనా తేడాలువచ్చాయా?

కమిషన్‌ వేస్తారు. అది ఒక నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ప్రచురించమని, బయటపెట్టమని ప్రజలు ఆందోళన చేస్తారు. కాని ప్రభుత్వం దాన్ని ప్రచురించదు. శ్రీమతి ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక చట్టపరమైన సవరణ కూడా తెచ్చారు. ఏమని అంటే, జాతి ప్రయోజనాల రీత్యా, దేశ భద్రత దృష్ట్యా ఒక కమిషన్‌ నివేదిక ప్రచురించడం మంచిదికాదు అని ప్రభుత్వం అనుకుంటే బయటపెట్టకుండా ఉండవచ్చు అని. అప్పుడే హిందూలో నేను ఒక వ్యాసం రాశాను.

ఇదంతా సమాజంపట్ల, వ్యవస్థ పట్ల బ్రాహ్మణీయ అవగాహన అని నా అభిప్రాయం. మనలో బ్రాహ్మణీయ అవగాహన ఎంతగా దిగిపోయి ఉందంటే, ఆచారాలు, క్రతువులు తంతులు ముఖ్యమనీ, మనుషులు ముఖ్యం కాదనీ బ్రాహ్మణ్యం అనుకుంటుంది. మనుషులను పక్కకు తోసేసి, ఆచార వ్యవహరాలకు, మూర్ఖపు పద్ధతులకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు మన ప్రభుత్వాలు కూడా వేర్వేరు ఆచారపు తంతులు నడుపుతూ ఉంటాయి ­. ప్రజలు తిరగబడకుండా, ప్రభుత్వాన్ని విమర్శించకుండా, ప్రభుత్వం చేసేది అర్థం చేసుకోకుండా ఈ తంతులు అడ్డం పడుతూ ఉంటాయి ­. నిజంగా ప్రజలకు న్యాయం ఇవ్వాలనే ఆలోచనకు మన రాజకీయాల్లో చోటు లేనేలేదు.

 

కె.జి. కన్నబిరాన్‌

ఆత్మకథాత్మక సామాజిక చిత్రం

అక్షరీకరణ :ఎన్ .వేణుగోపాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *