లోక్‌సభ ఎన్నికల బరిలో 525 మంది

సికింద్రాబాద్‌లో అత్యధికంగా 45 మంది
ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది పోటీ
కరాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ వెల్లడి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 1 : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. ఎన్నికల పక్రియ మొదలయ్యిందని, ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను ఆయన వెల్లడిరచారు. సికింద్రాబాద్‌లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది పోటీ చేస్తున్నారని తెలిపారు. 285 మంది స్వతంత్రుల అభ్యర్థులు బరిలో ఉన్నట్లు వివరించారు.

అభ్యర్థుల సంఖ్య దృష్ట్యా ఏడు స్థానాల్లో మూడు ఈవీఎంలు, 9 స్థానాల్లో రెండు ఈవీఎంలు ఉపయోగించనున్నట్లు తెలిపారు. శుక్రవారం నుంచి హోం ఓటింగ్‌ ప్రారంభం కానుందన్నారు. హైదరాబాద్‌ నగరంలో 3,986 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వికాస్‌రాజ్‌ చెప్పారు. అన్నిచోట్లా ఓటరు స్లిప్పుల పంపిణీ జరుగుతోందని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ను జిల్లాల్లో ప్రింట్‌ చేస్తున్నారని చెప్పారు. ఎన్నిక విధులకు 155 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయన్నారు. 2.94 లక్షల మంది ఎన్నికల సిబ్బందిని వినియోగిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నెంబర్‌ 1950 ఏర్పాటు చేశారని.. దీని ద్వారా ఇప్పటివరకు 1,227 ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయని చెప్పారు. 15 వేల మంది సర్వీస్‌ ఓటర్లు ఉన్నారని సీఈవో వికాస్‌రాజ్‌ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *