లాలూను వదలని సిబిఐ

పాట్నా, డిసెంబర్‌ 26 :ఆర్జేడీ అధినేత, బీహార్‌ ‌మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌పై ఉన్న ఓ అవినీతి కేసును సీబీఐ తాజాగా రీఓపెన్‌ ‌చేసింది. యూపీఏ-1 ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవినీతికి పాల్పడ్డాడని లాలూ యాదవ్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై సీబీఐ 2018లో విచారణ ప్రారంభించింది. అయితే, అవినీతి ఆరోపణలపై అప్పట్లో ఎలాంటి కేసు నమోదు కాకపోవడంతో 2021 మే నెలలో విచారణ ముగించింది.

ఇప్పుడు మళ్లీ ఈ కేసును సీబీఐ తిరిగి రీఓపెన్‌ ‌చేసింది. జేడీయూతో కలిసి బీహార్‌ ‌లో ఆర్జేడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నెలల వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం రాజకీయపరంగా కలకలం రేపుతోంది. కాగా, రైల్వే ప్రాజెక్టుల అవినీతి కేసులో లాలూయాదవ్‌తో పాటు ఆయన కుమారుడు, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌, ‌లాలూ కుమార్తెలు చందా యాదవ్‌, ‌రాగిణి యాదవ్‌లు నిందితులుగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *