- ఉగ్రవాదంపై పాక్ తీరును మరోమారు నిలదీసిన భారత్
- ఐక్యరాజ్య సమితి వేదికగా పాక్పై జై శంకర్ తీవ్ర వ్యాఖ్యలు
- ఐక్యరాజ్య సమితి కార్యాలయం ముందు గాంధీ విగ్రహావిష్కరణ
న్యూ దిల్లీ, డిసెంబర్ 15 : అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో దాయాది పాక్ తీరును భారత్ మరోసారి నిలదీసింది. భారత్ పట్ల పాక్, చైనా తీరుపై విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జై శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి ఊతమిచ్చేవారిని రక్షించడానికి అంతర్జాతీయ వేదికలను కొన్ని దేశాలు దుర్వినియోగం చేస్తున్నాయని పరోక్షంగా చైనా, పాకిస్థాన్లపై జైశంకర్ ఘాటు విమర్శలు చేశారు. ఐక్య రాజ్యసమితి భద్రతా మండలిలో పాక్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. దీనికి భారత్ గట్టిగా బదులిచ్చింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్పై భారత్ బుధవారం ధీటుగా స్పందించింది. ఒసామా బిన్లాడెన్ లాంటి ఉగ్రవాదికి ఆశ్రయం కల్పించిన దేశానికి, పొరుగు దేశం పార్లమెంటుపై దాడికి పాల్పడిన వారికి యుఎన్ ప్రపంచవేదికపై నీతులు చెప్పే అర్హత లేదని పేర్కొంది.
ఐరాస భద్రతా మండలి చర్చా కార్యక్రమంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తగా, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. మహమ్మారి, పర్యావరణ మార్పు, వివాదాలు లేదా ఉగ్రవాదం వంటి కీలక సవాళ్లపై సమర్థవంతంగా స్పందిస్తేనే ఐరాసపై విశ్వసనీయత ఆధారపడి ఉంటుందన్నారు. బహుళ పాక్షిక సంస్కరణలపై చర్చించేందుకు జైశంకర్ ఐక్యరాజ్యసమితి కార్యాలయానికి చేరుకున్న సంగతి తెలిసిందే. బహుళ పాక్షికత ఆవశ్యకతపై దృష్టి పెడుతున్నామని, దీనిపై భారత్ ప్రత్యేక అభిప్రాయాలను కలిగి ఉందని అన్నారు. సమస్యలపై ఉత్తమ పరిష్కారం కోసం శోధిస్తున్నప్పుడు ఇటువంటి ముప్పులను సాధారణంగా తీసుకోకూడదని, ప్రపంచం మొత్తం ఆమోదించదని .. వాటిని సమర్థించాలనే ప్రశ్న తలెత్తకూడదని అన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలకు ఇది వర్తిస్తుందని అన్నారు. పొరుగుదేశ పార్లమెంటుపై దాడి చేసిన దేశానికి యుఎన్లో ఇతరులకు బోధించే అర్హత లేదని అన్నారు.
కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు భారత్ అంతర్గత వ్యవహారమని అన్నారు. పాకిస్థాన్ అసత్య ప్రచారాలను ఇకనైనా ఆపాలని సూచించారు. ఉగ్రవాదం, శతృత్వం, హింసకు తావులేని వాతావరణంలో మాత్రమే తాము ఇస్లామాబాద్తో సంబంధాలను కోరుకుంటున్నామని భారత్ పేర్కొంది. బిన్ లాడెన్ లాంటి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన వారికి…. భారత్ పార్లమెంట్ దాడికి పాల్పడిన వారికి యునైటెడ్ నేషన్స్ వంటి వేదికపై శాంతి వ్యాఖ్యలు బోధించే అర్హత లేదని జైశంకర్ చురక లంటించారు. ఉగ్రవాద నిర్మూలనకు అనేక దేశాలు బాధ్యతగా వ్యవహరిస్తుంటే..కొన్ని దేశాలు మాత్రం ఉగ్రవాదులను సమర్ధించేలా.. వారిని రక్షించేలా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని జైశంకర్ అన్నారు. ఈ విషయాన్ని పాక్ అర్థం చేసుకుంటే మంచిదని సూచించారు.
భారత్ పై వ్యతిరేక ప్రచారాన్ని ఆపాలని హితవు పలికారు. ఉగ్రవాదం, శత్రుత్వం, హింసకు తావులేని ఇస్లామాబాద్ తో సంబంధాలు కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఉగ్రవాదులను బ్లాక్ లిస్టులో చేర్చాలనే ప్రతిపాదనకు చైనా వీటో అధికారంతో అడ్డుపడటంపై జై శంకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా, పర్యావరణ మార్పు, ఉగ్రవాదం వంటి వాటిపై ఐక్యరాజ్యసమితి స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలావుంటే ప్రపంచం ఎదుర్కొంటున్న హింస, సరిహద్దు ఘర్షణ వంటి అనేక సంక్షోభాలు సద్దుమణగడానికి మహాత్మ గాంధీ ఆచరించిన అహింస,శాంతి సిద్దాంతలు దోహదం చేస్తాయని భారత విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి ఎస్ . జై శంకర్ అన్నారు.
న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తో కలిసి ఎస్ జైశంకర్ ఆవిష్కరించారు. అహింస, శాంతి, నిజాయితీలకు ప్రతిరూపం గాంధీ మహాత్ముడు అని జై శంకర్ కొనియాడారు. ఐక్యరాజ్యసమితిలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పడం ద్వారా గాంధీజీ పేర్కొన్న ఆదర్శాలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకొంటున్నట్లవుతుందని జైశంకర్ తెలిపారు. అటు సామ్రాజ్యవాదంపై మహాత్మా గాంధీకి ఉన్న వ్యతిరేకతే ఐక్య రాజ్య సమితికి పునాది అని గుటెరస్ చెప్పారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం అక్కడ నెలకొల్పిన విగ్రహాన్ని .. ప్రముఖ భారతీయ శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ సుతార్ రూపొందించారు. దీనిని భారతదేశం ఐక్యరాజ్యసమితికి బహుమతిగా పంపింది.


