ఖాలీలను ఎందుకు భర్తీ చేయడం లేదు ..?
ప్రైవేటీకరణకు కుట్ర
రైల్వే ప్రమాదంపై సిబిఐ దర్యాప్తా..?
తీవ్రంగా తప్పుపట్టిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే
పలు ప్రశ్నలు సంధిస్తూ ప్రధాని మోదీకి లేఖ
న్యూ దిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్,జూన్6: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐతో దర్యాప్తు జరిపించనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన ప్రకటనను ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు. ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను గాలికొదిలేసి ఇలా దర్యాప్తు సంస్థలకు అప్పగించినంత మాత్రాన ఏం ప్రయోజనం అని లేఖలో ప్రశ్నించారు. రైల్వేలో సిబ్బంది కొరత, సంస్థాగత లోపాలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ•కి మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ప్రస్తుతం భారతీయ రైల్వేలో 3 లక్షల పోస్టులు ఖాలీగా ఉన్నాయి. ఘోర ప్రమాదం జరిగిన తూర్పు కోస్తా రైల్వేలోనూ 8,278 పోస్టులు భర్తీ కాకుండా ఉన్నాయి. వీటిని గత 9 ఏళ్లుగా ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. మైసూరులో రెండు రైళ్లు ఢీకొన్న విషయం ప్రస్తావిస్తూ సిగ్నలింగ్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వివరిస్తూ గత ఏడాది ఫిబ్రవరి 8న నైరుతి జోనల్ రైల్వే చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ రైల్వే బోర్డుకు లేఖ రాశారు. అంతటి కీలకమైన హెచ్చరికను రైల్వేశాఖ ఎందుకు విస్మరించిందన్నారు. రైల్వే సేప్టీ కమిషన్ (సీఆర్ఎస్) చేసిన హెచ్చరికలపై రైల్వేబోర్డు పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు పార్లమెంటరీ స్థాయీ సంఘం గత డిసెంబరులో సమర్పించిన నివేదికలో పేర్కొంది. సీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసి అది స్వతంత్రంగా పని చేసే విధంగా ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. 2017-18 నుంచి 2020-21 మధ్యకాలంలో ప్రతి 10 ప్రమాదాల్లో 7 పట్టాలు తప్పడం వల్లే జరిగినట్లు కాగ్ నివేదిక ప్రత్యేకంగా చెప్పింది. అయినా.. దీన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. 2017-21 మధ్య ఈస్ట్ కోస్ట్ రైల్వేలో రైల్, వెల్డ్ (ట్రాక్ మెయింటెనెన్స్) తనిఖీలు ఒక్కటి కూడా జరగలేదు. కాగ్ చెప్పిన కీలక విషయాలను ఎందుకు పాటించలేదని నిలదీసారు.
రాష్టీయ్ర రైల్ సంరక్ష కోష్కు 79 శాతం మేర నిధులు కోత పెట్టినట్లు కాగ్ పేర్కొంది. ఈ నిధికి ఏటా రూ.20వేల కోట్లు అందుతాయని బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో చెప్పినా ఆ పని చేయలేదు. ట్రాక్ రెన్యూవల్ పనులకు అవసరమైన నిధులు ఎందుకు ఇవ్వడంలేదు..? ఇది ప్రయాణికుల భద్రతతో ఆడుకోవడం కాదా..?రైళ్లు ఢీ కొనకుండా గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన ’కవచ్’ను ఎందుకు పక్కనపెట్టారు..? దీనికి రు ఏం సమాధానం చెబుతారు..? రైల్వే బడ్జెట్ను 2017-18 నుంచి ప్రధాన బడ్జెట్లో విలీనం చేయడానికి కారణమేంటి..? అది రైల్వేశాఖ స్వతంత్రత, నిర్ణయాధికారాన్ని ప్రభావితం చేయలేదా..? రైల్వే స్వతంత్ర తను దెబ్బతీసి ప్రైవేటీకరణ కోసమే ఈ విధానం ప్రవేశపెట్టారా..?అని ఖర్గే ప్రశ్నించారు. బాలాసోర్ ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నామని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పినప్పటికీ ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. సీబీఐ నేరాలపై దర్యాప్తు చేయడానికి తప్పితే రైలు ప్రమాదాల కోసం కాదు. సాంకేతిక, వ్యవస్థాగత, రాజకీయ వైఫల్యాలకు బాధ్యులు ఎవరన్నది సీబీఐ తేల్చలేదు.2016లో కాన్పుర్లో జరిగిన రైలు ప్రమాదంలో 150 మంది చనిపోయినప్పుడు రైల్వే మంత్రి దానిపై ఎన్ఐఏ దర్యాప్తు కోరారు. కానీ.. 2018లో ఎన్ఐఏ ఆ దర్యాప్తును మూసేసింది. ఛార్జిషీట్ దాఖలు చేయడానికి కూడా తిరస్కరించింది. నాటి ఘోరానికి కారకులు ఎవరన్నది ఇప్పటికీ తెలియదు. ఆ వాస్తవాన్ని విస్మరించి మళ్లీ ఇప్పుడు కొత్త దర్యాప్తు సంస్థ (సీబీఐ)ను తెరదికి తేవడం వల్ల ఏం ప్రయోజనం. రైల్వేలో ఉన్న భద్రతాపరమైన సమస్యలను పరిష్కరించడంతోపాటు, ప్రమాదాలకు బాధ్యులను గుర్తించకుండా ఇలా రోజుకో ప్రకటనతో దృష్టి మళ్లించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.మానవ వనరుల కొరత కారణంగా రైల్వే లోకో పైలట్స్ కూడా ఎక్కువ గంటలు పని చేయాలని రైల్వే బోర్డు ఇటీవల చెప్పింది. వారిపై పనిభారం పెరగడం ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోంది. ఆ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదన్నారు. రైల్వే ప్రైటీకరణను పార్లమెంటు సమావేశాల సమయంలో తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ రైళ్ల నుంచి స్టేషన్ల వరకు అన్నింటినీ ప్రైవేటు పరం చేస్తున్నారు. ఎవరితో సంప్రదింపులు జరపకుండా నేషనల్ •రైల్వే లను 2050 తయారు చేయడం రైల్వేను బలహీనం చేసి, దాన్ని ప్రైవేటు కంపెనీలకు పంచిపెట్టడానికి కాదా..?అని అన్నారు.
బాలాసోర్కు చేరుకున్న సిబిఐ బృందం
రైల్వే ప్రమాదంపై దర్యాప్తునకు రంగంలోకి అధికారులు
ఒడిశాలోని బహనాగా బజార్లో జరిగిన రైలు ప్రమాదంపై రైల్వే మంత్రిత్వ శాఖ, ఒడిశా ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు సంస్థ సీబీఐ తెలిపింది. కోరమాండల్ ఎక్స్ప్రెస్, యశ్వంత్పూర్-హౌరా ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు ప్రమాదానికి సంబంధించి సంబంధించిన రైలు ప్రమాదంపై కేసు నమోదు చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కూడా తన సమ్మతిని తెలిపింది. రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందా, నిర్లక్ష్యం వల్ల జరిగిందా లేదంటే సాంకేతిక లోపం వల్ల జరిగిందా అన్న పలు అంశాలపై సీబీఐ విచారణ జరపనుంది. సీబిఐ బృందం బాలాసోర్కు చేరుకుంది. ప్రస్తుతం దర్యాప్తు జరుపుతోందని అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ రైల్వే బోర్డు జూన్ 4న నిర్ణయం తీసుకుంది. ఫోరెన్సిక్, బృందం సాక్ష్యాలను సేకరిస్తున్నారని, ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారని, వారికి రైల్వే కూడా సహాయం చేస్తోందని సౌత్ ఈస్టర్న్ రైల్వే అఖఖీక్ష ఆదిత్య కుమార్ చౌదరి తెలిపారు. ఖరగ్పూర్, బాలాసోర్తో సహా పలు ప్రాంతాల్లో రైల్వే సేప్టీ కమిషనర్ (అఖా) బృందం కూడా పని చేస్తోంది. వారు మొత్తం సమాచారాన్ని సేకరిస్తున్నారు. లోకో పైలట్ మరణానికి సంబంధించి కొన్ని నకిలీ వార్తలు ప్రచారం అవుతున్నాయి. కానీ స్టేషన్ మాస్టర్, లోకో పైలట్ ఆరోగ్యం నిలకడం ఉందని, వారు భువనేశ్వర్లో చికిత్స పొందుతున్నారని అధికారులు ఇంతకుమునుపే వెల్లడించారు. ఒడిశా పోలీసులు రైల్వే చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిర్లక్ష్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ఈ ఘటనలో మరణించిన 101 మందిని ఇంకా వారి కుటుంబాలు క్లెయిమ్ చేయవలసి ఉండగా, సుమారు 200 మంది వివిధ హాస్పిటల్స్ లలో చికిత్స పొందుతున్నారు.




