పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19: కలుషిత జలాలు తాగి పశుసంపదను కోల్పోయిన రైతులకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అండగా నిలిచారు.అమీన్ పూర్ మండల పరిధిలోని సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన బిక్షపతి, రాజు అనే ఇద్దరు రైతులకు సంబంధించిన ఐదు బర్రెలు ఇటీవల గ్రామ పరిధిలోని ఆసానికుంటలో కలుషిత జలాలు తాగి మృత్యువాత పడ్డాయి. స్థానిక ప్రజా ప్రతినిధుల ద్వారా సమాచారం అందుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్.. ఘటనకు సంబంధించి కారకులైన సంభందిత పరిశ్రమ యజమానులతో చర్చించారు. ఈ మేరకు ఇద్దరు రైతులకు రెండు లక్షల 50 వేల రూపాయల నష్టపరిహారాన్ని అందించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.


