- 7వ దశలో 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్
- 2019లో వీటిలో కేవలం 25 స్థానాలను మాత్రమే గెలుచుకున్న బిజెపి
- 543 స్థానాలకు జూన్ 4న కౌంటింగ్
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, మే 30 : రేపు జూన్ 1న జరుగనున్న చివరి మరియు 7వ దశ ఎన్నికలకు ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. శనివారం జరిగే చివరి దశ ఎన్నికలలో 57 స్థానాలకు గాను పోలింగ్ జరుగనుంది. అందులో ఉత్తర్ప్రదేశ్లో 13 స్థానాలకు, పంజాబ్లో 13 స్థానాలకు, బీహార్లో 8 స్థానాలకు, వెస్ట్ బెంగాల్లో 9 స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్లో 4 స్థానాలకు, ఒడిషాలో 6 స్థానాలకు, జార?ండ్లో 3 స్థానాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతం చండీగడ్ స్థానానికి పోలింగ్ జరుగనుంది. ప్రధాని మోదీ పోటీ చేసే ఉత్తర్ప్రదేశలోని వారణాసి స్థానానికి కూడా రేపు పోలింగ్ జరుగనుంది. కాగా 2019లో జరిగిన ఎన్నికలలో ఈ 57 స్థానాలలో బీజేపీ 25 స్థానాలలో మాత్రమే గెలిచింది. అంటే యాబై శాతం కన్నా తక్కువ సీట్లనే గెలుచుకోగింది.
ఆ విధంగా పరిశీలిస్తే అప్పుడు బిజేపికి అన్ని దశల కంటే తక్కువ స్థానాలు 7వ దశ పోలింగ్లో జరిగే స్థానాలలోనే వొచ్చాయి. అందుకే ఈ దశ ఎన్నికలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డిఏకు, అదే విధంగా ప్రతిపక్షాలకు చాలా కీలకమనే చెప్పాలి. ఎందుకంటే మూడవసారి అధికాంలోకి రావాలనే తమ టార్గెట్ చేరుకోవడానికి బీజేపీకి ఈసారి మరిన్ని సీట్లు గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా తమ టార్గెట్ అయిన ఎన్డిఏను గద్దె దించడానికి కాంగ్రెస్తో సహా ప్రతిపక్షాలకు గత ఎన్నికలలో గెలిచిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు సాధిస్తేనే అది సాధ్యమవుతుంది. అయితే ఈ సారి యూపీలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలతో కూడిన ఇండియా కూటమి నుంచి బీజేపీ గతంలో కంటే తీవ్రమైన పోటీని ఎదుర్కుంటున్నది. కాగా ఎవరెన్ని లెక్కలు వేసుకున్నా జూన్ 4న కౌంటింగ్ అనంతరమే ఎవరి భవిష్యత్తు ఏంటనేది స్పష్టం కానుంది.




