రుణమాఫీ జమ అయిన రైతులకు కొత్త పంట రుణాలు

జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: జగదేవపూర్ మండల వ్యాప్తంగా తేది.11-12-2023  నాటికి బ్యాంకులో పంట రుణం తీసుకొని చెల్లించని రైతులకు రుణమాఫీ డబ్బులు జమవుతున్నాయని ఇప్పటివరకు మండలంలో 2826 మంది రైతులకు రూ. 13 కోట్లు రుణమాఫీ డబ్బులు జమ అయ్యాయని మండల వ్యవసాయ అధికారి యు వసంతరావు తెలియజేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇంకా రోజువారి డబ్బులు జమవుతున్నాయని తెలిపారు. రుణమాఫీ అయిన రైతులు తమకు సంబంధించిన బ్యాంకులకు వెళ్లి మరల పంట రుణాలు పొందవచ్చని తెలియజేశారు. దీనికోసం రోజువారీగా గ్రామాల వారీగా తేదీలను ఖరారు చేసి బ్యాంకులకు  రైతులకు వ్యవసాయ విస్తీర్ణ అధికారుల ద్వారా తెలియజేయడం జరిగిందని తెలిపారు.అదేవిధంగా రుణమాఫీ పొందిన రైతులు తమ బ్యాంకులకు కేటాయించిన తేదీలకు వెళ్లి కొత్త పంట రుణాలు పొందాలని తెలిపారు. మండలంలోని యస్ బీఐ , ఏపీజీవీబీ డీసీసీబీ బ్యాంకులకు వెళ్లి రుణమాఫీ పొంది కొత్తగా పంట రుణాలు మంజూరు గురించి ఆయా శాఖలు బ్యాంక్ మేనేజర్లతో మాట్లాడామని అన్నారు.ఇప్పటివరకు 1500 మంది రుణమాఫీ అయిన రైతులు కొత్త పంట రుణాలు తీసుకున్నారని తెలిపారు. మండలంలో మిగిలిన రుణమాఫీ పొందిన రైతులు కూడా కొత్త పంట రుణాలను పొందాలని కోరారు. విరితో పాటుగా వ్యవసాయ విస్తీర్ణ అధికారి మహమ్మద్ ఖలీల్, వివిధ బ్యాంకు మేనేజర్స్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *