రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

గ్రూప్‌-1లో మరో 60 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు
మొత్తం 563కు పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌కు టిఎస్‌పిఎస్‌సికి సిఎం ఆదేశం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌ 1లో పోస్టుల సంఖ్యను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 60 పోస్టులు అదనంగా పెంచింది. గతంలో 503 పోస్టులకు టీఎస్సీయస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 60 పోస్టులకు ఆమోదం తెలపడంతో ఆ సంఖ్య 563కు పెరిగింది. మొత్తం పోస్టులకు వీలైనంత త్వరలో నోటిఫికేషన్‌ ఇవ్వాలని తెలంగాణ సర్కార్‌ టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. కాగా గ్రూప్‌`1లో 19 విభాగాల్లో 503 పోస్టులను ఇంటర్వ్యూలు లేకుండానే భర్తీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలని టీఎస్‌పీఎస్సీ అప్పట్లో నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేసి గతేడాది జూన్‌ 11న ప్రిలిమ్స్‌ రాత పరీక్షను నిర్వహించింది.

ఈ పరీక్షకు దాదాపు 2.32లక్షల మంది అభ్యర్ధులు హాజరయ్యారు. అయితే అనూహ్యంగా పేపర్‌ లీకేజీకి వ్యవహారం బయటపడటంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. గ్రూప్‌ 1తో సహా పలు పరీక్షల పేపర్లు రాత పరీక్షకు ముందే వివిధ వ్యక్తుల చేతుల్లోకి చేరినట్లు సీబీఐ ఆధారాలతో సహా నిరూపించింది. దీంతో గ్రూప్‌ 1తోపాటు పలు పరీక్షలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు రెండో సారి గ్రూప్‌ 1 పరీక్షను టీఎస్సీయస్సీ నిర్వహించింది. ఆ పరీక్ష కూడా రద్దయిన విషయం తెలిసిందే. తాజాగా పెరిగిన పోస్టులతో కొత్తగా మరోమారు గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ ఇచ్చి, సజావుగా పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో గ్రూప్‌`1 పోస్టుల సంఖ్య 563కి చేరాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *