హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30 : రాష్ట్ర ప్రజలకు సిఎం కెసిఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, భక్తి శ్రద్ధలతో హిందువులు గణనాథుణ్ణి ఆరాధిస్తారని సీఎం కేసీఆర్ అన్నారు. జ్ఞానం, లక్ష్య సాధన, నైతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ వంటి సుగుణాలను వినాయక చవితి పండుగ మనకు నేర్పుతుందని సిఎం అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా, ఆనందంతో జరుపుకోవాలని సిఎం ఆకాంక్షించారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా వాటిని వినాయకుని దీవెనలతో అధిగమిస్తూ, సకల జన సంక్షేమమే లక్ష్యంగా, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని సిఎం ఈ సందర్భంగా అన్నారు. తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేలా, సుఖ శాంతులతో జీవించేలా, దేశ ప్రజలందరకీ ఆ ఏకదంతుని దీవెనలు అందాలని సీఎం కేసిఆర్ ప్రార్థించారు.



