రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం

  • రాష్ట్ర మొత్తం రుణాలు రూ. 6,71,757 కోట్లు
  • ఎఫ్‌ఆర్‌బీఎఎమ్‌ రుణాలు రూ.3,89,673
  • ఎస్‌పివీల రుణ బకాయిలు రూ.95,462 కోట్లు
  • ప్రభుత్వ హామీ లేని రుణాలు రూ.59,414 కోట్లు
  • ప్రభుత్వమే చెల్లించే ఎస్‌పీవీల రుణాలు రూ.1,85,029
  • బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20 శాతం అంతరం
  • రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగిన రుణ చెల్లింపుల భారం
  • రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీతాలకు 35 శాతం వ్యయం
  • రోజూ వేస్‌ అండ్‌ మీన్స్‌పై ఆధారపడాల్సిన దుస్థితి
  • 2014లో మిగులు రాష్ట్రం…2023లో నిండా అప్పుల్లో
  • 42 పేజీల శ్వేతపత్రం విడుదల…విడుదల చేసిన డిప్యూటీ సీఎం
  • పలువురు మృతికి శాసన సభ సంతాపం
  • ప్రభుత్వ నోట్‌పై జవాబుకు టైమ్‌ కావాలన్న విపక్షాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు ఉన్నాయి. 2014 -15 నాటికి రాష్ట్ర రుణం రూ.72,658 కోట్లు అప్పు ఉంది.  2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సంవత్పరానికి సగటున 24.5 శాతం అప్పు పెరిగింది. 2015-16లో రాష్ట్ర రుణ, జీఎస్డీపీ 15 .7 శాతంతో దేశంలోనే అత్యల్పంగా ఉన్నది. 2023-24 నాటికి రుణ, జిఎస్‌డిపి శాతం 27.8 శాతానికి పెరిగింది. బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి 20 శాతం అంతరం ఉంది. 57 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధికి చేసిన మొత్తం వ్యయం రూ. 4.98 లక్షలు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెరిగిన రుణభారం పది రెట్లు. రెవెన్యూ రాబడిలో రుణ చెల్లింపు భారం 34 శాతానికి పెరిగింది. రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీతాలకు 35 శాతం వ్యయం అయితున్నది. ఇక రోజూ వారీ వ్యయాలకు వేస్‌ అండ్‌ మీన్స్‌పై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. బడ్జెటేతర రుణాలతో తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో    ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తమ శ్వేతపత్రంలో వివరాలను పొందుపరిచారు. ఇక నాలుగు రోజుల విరామం అనంతరం శాసనసభ సమావేశాలు బుధవారం తిరిగి ప్రారంభమయ్యాయి.

సభ మొదలవ్వగానే స్పీకర్‌ పార్టీల శాసన సభా పక్ష నేతలను ప్రకటించారు. ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా అక్బరుద్దీన్‌, సీపీఐ శాసనసభా పక్ష నేతగా కూనంనేని సాంబశివరావులను ప్రకటించారు. అనంతరం ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం ప్రకటించింది. అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 42 పేజీల శ్వేతపత్రాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం…2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం రూ.3,89,673 కోట్లు. అయితే 42 పేజీల పుస్తకం ఇచ్చి ఇప్పుడే మాట్లాడాలి అంటే ఎలా…అని మాజీ మంత్రి హరీష్‌ రావు ప్రశ్నించారు. నివేదికను చదివే సమయం కూడా తమకు ఇవ్వలేదని మండిపడ్డారు. ముందు రోజే డాక్యుమెంట్‌ ఇచ్చి ఉంటే బాగుండేదని చెప్పారు.

ప్రభుత్వం ఇచ్చే సమాధానం సంతృప్తి కలిగించకపోతే నిరసన చేసే అవకాశం ఉందన్నారు. సభను హుందాగా నడిపేందుకు బీఆర్‌ఎస్‌ పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రజలందరూ అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దశాబ్దకాలం పాలించిన గత ప్రభుత్వం వనరులన్నీ అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ఉపయోగించలేదన్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందిని వెల్లడిరచారు. ఇలాంటి పరిస్థితి రావడాన్ని తాను దురదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. దశాబ్ద కాలంలో జరిగినటువంటి ఆర్థిక తప్పిదాలను ప్రజలకు తెలియాలని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదలపై బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావు, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ, సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు అభ్యంతరం వ్యక్తంచేశారు.

42 పేజీల పుస్తకం ఇచ్చి రెండు నిమిషాల్లోనే చర్చ మొదలుపెడితే ఎలా మాట్లాడాలని ప్రశ్నించారు. ముందురోజే నోట్‌ ఇస్తే తాము ఏం మాట్లాడాలో ప్రిపేర్‌ అయ్యేందుకు అవకాశం ఉండేదని అన్నారు. నోట్‌ చదివేందుకు కనీసం ఒక గంట టీ బ్రేక్‌ అయినా ఇవ్వాలని అక్బరుద్దీన్‌ ఒవైసీ కోరారు. నోట్‌ ప్రిపేర్‌ అయ్యేందుకు రేపటి వరకు సమయం ఇస్తే బాగుంటుందని కూనంనేని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సభ్యులు తామిచ్చిన నోట్‌పై ప్రిపేర్‌ అయ్యేందుకు టీ బ్రేక్‌కు అనుమతిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. దాంతో స్పీకర్‌ టీ బ్రేక్‌ ప్రకటిస్తూ సభను అరగంట వాయిదా వేశారు. అనంతరం సభ తిరిగి ప్రారంభం అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *