హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : పరిశ్రమ ఏదైనా పెట్టుబడులకు డెస్టినేషన్గా తెలంగాణ మారుతున్నది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి జాతీయ అంతర్జాతీయ కంపెనీలు క్యూకడుతున్న క్రమంలో తాజాగా గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన అడ్వెంట్ ఇంటర్నేషనల్ రాష్ట్రంలో రూ.16,650 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వొచ్చింది. ఈ మేరకు కంపెనీ ఎండీ పంకజ్ పట్వారీ, సంస్థ ప్రతినిధులు హైదరాబాద్లో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో సంస్థ విస్తరణ, పెట్టుబడి కార్యకలాపాలను కేటీఆర్కు వివరించారు. ఈనేపథ్యంలో సంస్థ పెట్టుండిపై మంత్రి కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విట్టర్) వేదికగా హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో గ్రీన్ఫీల్డ్ ఆర్ అండ్ డీ ల్యాబ్ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇది ఫార్మా, లైఫ్ సైఫ్సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ వృద్ధికి సంకేమని చెప్పారు. అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా సహకరిస్తామని వెల్లడించారు.




