రేణుకాచౌదరి, అనిల్, వద్దిరాజుల ఎన్నిక
పెద్దల సభకు నడ్డా, సోనియాల ఏకగ్రీవ ఎన్నిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవా రం సాయంత్రం ముగియడంతో తెలంగాణ నుంచి పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో 3 స్థానాలకు కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి ఒకరు బరిలో నిలవగా.. ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే శ్రమజీవి పార్టీ తరఫున జాజుల భాస్కర్, భోజరాజు కోయల్కర్, స్వతంత్ర అభ్యర్థిగా కిరణ్ రాథోడ్ లు నామినేషన్లు వేశారు. అయితే, రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయాలనుకునే ఒక్కో అభ్యర్థికి కనీసం 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాల్సి ఉంటుంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు మినహా మిగిలిన ముగ్గురికీ మద్దతుగా ఎమ్మెల్యేలెవరూ సంతకాలు చేయలేదు. ఈ క్రమంలో ఆ ముగ్గురి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించనున్నారు. పెద్దల సభకు జెపి నడ్డా, సోనియా గాంధీల ఎన్నిక రాజ్యసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా సోనియాగాంధీ తదితరులు మంగళవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభకు నడ్డా గుజరాత్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా…కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పలువురు రాజ్య సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు



