- 57 శాతం పెరిగిన సైబర్ క్రైమ్ నేరాలు
- 120 మంది మావోయిస్టుల లొంగుబాటు…మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణ
- మతఘర్షణలకు తావు లేకుండా చర్యలు
- ఇంటిలిజెన్స్ వ్యవస్థ బలోపేతం….శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట
- వార్షిక నివేదికను వెల్లడించిన డిజిపి మహేందర్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది. గతేడాదితో పోలిస్తే 4.44 శాతం క్రై రేట్ పెరిగినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. గురువారం 2022 క్రైమ్ వార్షిక నివేదికను డీజీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…57 శాతం సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయని తెలిపారు. ఈ ఏడాదిలో 120 మంది మావోయిస్టులు లొంగిపోయారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహా సేవలు అందించే లక్ష్యంలో భాగంగా తెలంగాణ శాఖ ముందుకు వెళ్ళిందని చెప్పారు. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఉండాలనే ప్రభుత్వ ఆదేశాలతో యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్లు చేసి విజయవంతం అయినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కమ్యూనల్ గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
టెర్రర్ అటాక్ జరగకుండా, ముందుగానే పసిగట్టి ఎలాంటి దాడులు జరగకుండా చేశామని చెప్పుకొచ్చారు. సీఐ సెల్, ఇంటెల్జెన్స్ వ్యవస్థ చాలా బాగా పని చేసిందని అన్నారు. ప్రజలు భయాందోళనకు గురి కాకుండా శాంతి భద్రతలను పరిరక్షించామని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. సైబర్ నేరాలు 57 శాతం, దొంగతనాలు 7 శాతం, అపహరణలు 15 శాతం పెరిగాయని తెలిపారు. మహిళలపై నేరాలు 3.8 శాతం పెరిగాయని చెప్పారు. హత్య కేసులు 12 శాతం, అత్యాచారాలు 17 శాతం తగ్గాయి. 152 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడిందని తెలిపారు. డయల్ 100 ద్వారా 13 లక్షల ఫిర్యాదులు వొచ్చాయన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా 1.1 లక్షల ఫిర్యాదులు రాగా, పోలీసు స్టేషన్లలో 5.5 లక్షల ఫిర్యాదు నమోదయ్యాయని తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. 15 లక్షల మందికి అవగాహన కల్పించామని చెప్పారు. గస్తీ వాహనాలు 7 నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకుని సేవలు అందించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు.హాక్ ఐ ద్వారా ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు.
ప్రజల భాగస్వామ్యంతో 10 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల ద్వారా 18,234 కేసులు ఛేదించామని స్పష్టం చేశారు. వేలి ముద్రల ద్వారా ఎంతో మంది నిందితులను గుర్తించామని పేర్కొన్నారు. 10 లక్షల మంది అనుమానితుల వేలి ముద్రలను సేకరించామని తెలిపారు. కరుడుగట్టిన నిందితులపై పీడీ చట్టం ప్రయోగించి నేరాలు అదుపు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది 431 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించామని తెలిపారు. విధుల దుర్వినియోగం, క్రమశిక్షణ ఉల్లంఘించిన పోలీస్ ఆఫీసర్స్ పై చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో విచారణ పూర్తయిందని స్పష్టం చేశారు. దిశ కమిషన్ రిపోర్ట్ హైకోర్టుకి ఇచ్చిందని, ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని తెలిపారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. హైకోర్టు ఆదేశాలతో ముందుకు పోతామని చెప్పారు. ఈ నెల 31 తేదీన తాను రిటైర్డ్ అవుతున్నానని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. తన కెరియర్లో సహకరించిన అందరికీ ధన్యవాదాలు అంటూ వ్యాఖ్యానించారు. గడిచిన 8 ఏళ్లలో ప్రభుత్వం, వి•డియా, ప్రజలు, సిబ్బంది తనకు చాలా సహకరించారని తెలిపారు. మహేందర్ రెడ్డి 2017 నవంబరు 17న తెలంగాణ రాష్ట్ర డీజీపీగా నియమితుడయ్యారు. ఏప్రిల్ 8, 2020న దేశంలోని టాప్ 25 ఐపీఎస్ అధికారుల జాబితాలో మహేందర్ రెడ్డి 8వ స్థానం దక్కించుకున్నారు.




