నిజామాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14 : తనకు మోదీ నోటీసు వొచ్చిందని, అది రాజకీయ కక్షతో పంపించిన నోటీసు కాబట్టి దానిపై పెద్దగా స్పందించాల్సిన అవసనం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈడీ నోటీసును తమ పార్టీ న్యాయ విభాగానికి ఇచ్చామని, ఆ విభాగం ఎలా చెబితే అలా ముందుకెళ్తామని తెలిపారు. గురువారం ఆమె నిజామాబాద్లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ…ఈడీ నోటీసులు తనకు అందాయని తెలిపారు. నోటీసులను పార్టీ లీగల్ సెల్కు అందజేశామని, వారి సూచనల మేరకు ముందుకు వెళ్తామని తెలిపారు. రాజకీయ కక్షతోనే నోటీసులు ఇచ్చినట్లు తాము బలంగా నమ్ముతున్నామన్నారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని తనకు నోటీసులు ఇచ్చారు.
గత ఏడాది కాలం నుంచి ఆ కేసులో దర్యాప్తు జరుగుతుందని, ఇంకెన్నాళ్లు ఆ విచారణ ఉంటుందో తనకు తెలియదన్నారు. 2జీ కేసులో కూడా ఇంత కాలం విచారణ జరగలేదనుకుంటానని, రాజకీయ ఉద్దేశంతోనే కేసు సాగుతుందని, తెలంగాణ ప్రజలు దీన్ని సీరియస్గా తీసుకోరన్నారు కవిత. పార్టీ లీగల్ బృందం ఇచ్చే సలహాల మేరకు ముందుకు వెళ్తామన్నారు. తాము ఏ పార్టీతోనూ కలవలేదని, కేవలం తెలంగాణ ప్రజలు, భారత దేశ ప్రజలతో మమేకం అయ్యామన్నారు. దేశ ప్రజలు సీఎం కేసీఆర్ను కావాలనుకుంటున్నారని, దీంతో ఆ రెండు పార్టీలకు ఆ భయం పట్టుకున్నట్లు ఆమె తెలిపారు. తాము ఎవరికీ బీ టీమ్ కాదన్నారు. అంతులేని టీవీ సీరియల్ తరహాలో విచారణ సాగుతున్నదని, అదేమీ పెద్ద విషయం కాదన్నారు. బీజేపీ ఎన్నికల స్టంట్లో భాగంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆమె ఆరోపించారు. ప్రజలే ఆ పార్టీకి బుద్ధి చెబుతారని కవిత పేర్కొన్నారు.




