పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 7: యువత వారి కాళ్ళ మీద నిలబడేలా స్వయం ఉపాధి కల్పించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. సోమవారం పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ పరిధిలోని నాగార్జున కాలనీలో రాఘవేంద్ర అనే వ్యక్తికి ఉపాధి పొందేందుకు ఐరన్ బాక్స్, ఇతర సామాగ్రిని నీలం మధు ముదిరాజ్ అందజేశారు. అనంతరం ఆయన దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ… ప్రతీ ఒక్కరూ తమ కాళ్ళపై వారు నిలబడేలా స్వయం ఉపాధి దిశగా ముందుకు కదలాలని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి తోడుగా తాను కూడా సహాయం ఇచ్చి వారి పురోభివృద్ధికి తోడ్పడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ వెంకటేష్, మురళీ, శ్రీనివాస్, విష్ణు, ఆశ్రఫ్, శ్రీను, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


