లక్నో, జూన్ 8 : లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమి అద్భుతమైన ప్రదర్శనతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్.. యూపీలోని మొత్తం 403 నియోజకవర్గాల్లో జూన్ 11 నుంచి 15 వరకు ధన్యవాద యాత్ర (Dhanyawaad Yatra) చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ యాత్రలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. ఇందులో భాగంగా యాత్రలో వివిధ వర్గాల ప్రజలకు రాజ్యాంగ ప్రతిని ఇచ్చి సత్కరించనున్నారు.
ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ ఆరింటిని గెలుచుకోగా, ఇండియా కూటమి మిత్రపక్షమైన సమాజ్వాదీ పార్టీ (ఎస్ పీ) 37 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ రెండు పార్టీలు కలిసి అధికార బిజెపిని కేవలం 33 స్థానాలకు పరిమితం చేశాయి. 2019 లోక్సభ ఎన్నికలలో ఎస్పి, కాంగ్రెస్లు వరుసగా ఒకటి, ఐదు స్థానాలను గెలుచుకున్నాయి. అయితే ఈసారి మాత్రం అనూహ్యంగా పుంజుకొని బీజేపీని కట్టడి చేశాయి.
గతంలో సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్బరేలీలో బిజెపి ప్రత్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్పై రాహుల్ గాంధీ లక్షలకు పైగా వోట్లతో ఘన విజయం సాధించారు. ఎన్నికల సంఘం ప్రకారం.. 2019లో రాయ్బరేలిలో దినేష్ ప్రతాప్ సింగ్పై 1,67,178 వోట్ల ఆధిక్యతతో సోనియా విజయం సాధించగా ఈసారి రాహుల్ ఆ రికార్డును బ్రేక్ చేశారు.
మరోవైపు, 2019 ఎన్నికల్లో మరో కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీ నుంచి రాహుల్ గాంధీని బరిలోకి దింపగా ఈసారి కాంగ్రెస్ విధేయుడు కిషోరీ లాల్ శర్మ పోటీలో నిలిపారు. ఆయనపై పోటీ చేసిన
బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీని 1.65 లక్షల వోట్ల తేడాతో ఓడిపోయారు.





