యాదగిరిగుట్టలో 100 పడకల ప్రభుత్వ దవాఖాన

  • శంకుస్థాపన చేసిన ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ‌రావు
  • లక్ష జనాభాకు 19 ఎంబిబిఎస్‌ ‌సీట్లు ..దేశంలోనే రాష్ట్రం నం.1
  • ఒక్కో సబ్‌ ‌సెంటర్‌లో ఒక్కో ఎంబీబీఎస్‌ ‌వైద్యుడు అని హామీ  
ఆలేరు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : శుక్రవారం సీఎం కేసీఆర్‌ ‌జన్మదినం సందర్బంగా కానుక ఒక రోజు ముందుగానే  అందిందని, యాదగిరి గుట్టలో వంద పడకల దవాఖానాకు పనులు మొదలు పెట్టామని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. యాదగిరి గుట్ట పట్టణంలో ఏర్పాటు చేసిన ఆలేరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ..ఇక్కడి ప్రజలకు మాత్రమే కాదు, పరిసర మండలాల ప్రజలతో పాటు, ఇక్కడకు వొచ్చే భక్తులకు ఈ హాస్పిటల్‌  ‌వైద్య సేవలు అందిస్తుంది..అలేరులో 35 ఏ ఎన్‌ ఎం ‌సబ్‌ ‌సెంటర్లు నిర్మాణం కోసం ఒక్కో దానికి 20 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. ఒక్కో సబ్‌ ‌సెంటర్‌లో ఒక్కో ఎంబీబీఎస్‌ ‌వైద్యుడు వొస్తాడు. పల్లె దవాఖాన అవుతుంది..ఎమ్మెల్యేలు అడగగానే, ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్‌లో డయాలసిస్‌ ‌సెంటర్‌లు ఏర్పాటు చేశాం. గతంలో ఒక్కటీ లేవు..అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ఆలేరు హాస్పిటల్‌ అభివృద్ధికి కోటి రూపాయలు త్వరలో మంజూరు చేస్తామన్నారు. వైద్య రంగానికి సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు..వైద్యారోగ్య రంగంలో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో వుంది.
ఉత్తప్రదేశ్‌ ‌చివరి స్థానంలో ఉన్నా అక్కడి నుండి మహేంద్ర పాండే అనే మంత్రి వొచ్చి ఇక్కడ విమర్శలు చేస్తరు..ముందు మీ ఉత్తర్‌ ‌ప్రదేశ్‌లో మంచిగా చేసుకో. అక్కడ వైద్య పరిస్థితులు దారుణంగా ఉన్నాయి..అని సూచించారు. నల్గొండలో, సూర్యాపేటలో మెడికల్‌ ‌కాలేజీలు ఏర్పాటు చేశాం. యాదాద్రి భువనగిరిలో త్వరలో ఒక మెడికల్‌ ‌కాలేజీ ఏర్పాటు చేస్తాం. ఒక్క ఏడాదిలో 8 మెడికల్‌ ‌కాలేజీలు ప్రారంభించాం. ఈ ఏడాది మరో 9 మెడికల్‌ ‌కాలేజీలు ప్రారంభిస్తున్నం..లక్ష జనాభాకు 19 ఎంబిబిఎస్‌ ‌సీట్ల తో తెలంగాణ దేశంలోనే నంబర్‌ ‌వన్‌ ‌స్థానంలో ఉంది. ఇది మన ఘనత అని మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. బీజేపీని విమర్శిస్తూ మంత్రి హరీష్‌ ‌రావు ..రాష్ట్ర ప్రభుత్వం 81 వేల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తే, బండి సంజయ్‌ ‌గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి..ఇన్ని నోటిఫికేషన్లు ఇస్తే, మాకు కార్యకర్తలు ఎట్లా అంటడు..మీది కుట్ర కాదా… నోటిఫికేషన్లు ఇస్తే సంతోషపడాల్సింది పోయి బాధపడుతున్నడు…కడుపులో ఉన్నదాన్ని బయటికి కక్కిండు..ఉద్యోగాలు ఇచ్చే తెలంగాణ ప్రభుత్వానిది కుట్ర అవుతుందా, ఉద్యోగాలు ఇస్తే ఏడ్చే బండి సంజయ్‌ది కుట్ర అవుతుందా..నిరుద్యోగులను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలన్నదే మీ కుట్ర. అని దుయ్యబట్టారు.
కొత్త ఉద్యోగాల కోసం బడ్జెట్‌లో వెయ్యి కోట్లు పెట్టుకున్నామని తెలుపుతూ ప్రజలకు పేల్చెటోడు, కూల్చిటోడు కావాలా…నిర్మించేటోడు కావాలి, పునాదులు తవ్వేటోడు కావాలని తెలిపారు. యాదాద్రి దేవాలయం కావాలని, పాఠశాలల అభివృద్ధి జరగాలని, హాస్పిటల్స్  ‌నిర్మాణం కావాలని, మెడికల్‌ ‌కాలేజీలు కావాలని, ప్రాజెక్టులు కావాలని ప్రజలు కోరుకుంటారు. ఇది బిఅర్‌ఎస్‌ ‌పార్టీ చేస్తుంటే, కాంగ్రెస్‌ ‌వాళ్లు పేల్చేస్తామంటరు…బిజెపి వాళ్లు కూల్చేస్తామంటరు..అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. బిడ్డా…ఇలాగే మాట్లాడితే వొచ్చే ఎన్నికల్లో ప్రజలు మీ డిపాజిట్లు గల్లంత చేస్తరు..ఏం చెప్పాలో దిక్కులేక, ప్రభుత్వాన్ని విమర్శించేందుకు అవకాశం లేక, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తే ఒకడు కుట్ర అంటడు, అంబేడ్కర్‌ ‌పేరు మీద సచివాలయం నిర్మిస్తే ఇంకొకడు కూలుస్తం అంటడు..మా నాయకుడు ఏ పని చేసినా ప్రజల కోసం చేసిండు..ఎన్నికల హామీ ఇవ్వకున్నా కల్యాణ  లక్ష్మి, మిషన్‌ ‌భగీరథ, రైతు బంధు, రైతు బీమా ప్రజల కోసం హామీ ఇవ్వకున్నా నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌ ‌ది..
యాదాద్రి  గుడి కట్టాము వోట్లప్పుడు చెప్పామా లేక, ఎన్నికల ముందు ఓపెనింగ్‌ ‌చేశామా..ఊహించని విధంగా, భూలోక వైకుంఠంగా దేవాలయం నిర్మించారు. ఎన్నికల కోసం లాభం అవుతుం•ని చేశారా..ఎన్నికలు అయ్యేదాకా గుళ్ళు కట్టుడు, ఎన్నికల ముందు ప్రారంభించే సంస్కృతి బిఅర్‌ఎస్‌ ‌పార్టీకి లేదు..ముఖ్యమంత్రి  మంచి మనసుతో చేశారు, భక్తితో చేశారు, రాజకీయాల కోసం చేయలేదు..బిజెపి లెక్క మతాన్ని రాజకీయం కోసం వాడుకునే సంస్కృతి కాదు మాది..ఎన్నికల కోసం గుడులను వాడుకునే పార్టీ మాది కాదు..అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. తెలంగాణ రాకముందు నీరు, కరెంట్‌ ‌లేక ఒకప్పుడు ఎంతో ఇబ్బంది పడ్డ ప్రాంతం ఇది..ఇప్పుడు అద్భుతంగా మారింది. నెలకు వెయ్యి కోట్లు అదనంగా కరెంట్‌ ‌డిపార్ట్‌మెంట్‌కి ఇవ్వండి, ఎంత ధర అయినా సరే కరెంట్‌ ‌కొనండి రైతులకు ఫుల్లు కరెంట్‌ ఇవ్వండని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని తెలిపారు. రోజుకు 40,50 కోట్లు పెట్టీ కరెంట్‌ ‌కొంటున్నాం. యూనిట్‌కి 25, 30 రూపాయలు పెట్టీ కొంటున్నం.
కానీ బోరు కాడ, బాయి కాడ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచిత కరెంట్‌ ‌రైతులకు ఇస్తున్నడు.. రైతు బంధు కింద 65 వేల కోట్లు, రైతు బీమా కోసం 5400 కోట్లు ఖర్చు పెట్టాం, ఉచిత కరెంట్‌ ‌కోసం 50 వేల కోట్లు ఖర్చు పెట్టాం.. ఎండాకాలం ఒక్క గంట ఎండవద్దని సీఎం  ఆలోచన. అందుకోసం రాత్రి పగలు కష్ట పడుతున్నాం. ఈ దేశంలో ఏ బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో గాని, ఏ కాంగ్రెస్‌ ‌పరిపాలించే రాష్ట్రంలో తెలంగాణలో ఇచ్చినట్టు కరెంట్‌ ఇస్తలేరని మంత్రి హరీష్‌ ‌రావు రాష్ట్రంలో విద్యుత్‌ ‌సరఫరాపై వివరించారు. కడుపులో బిడ్డ పడగానే ఇచ్చేది న్యూట్రిషన్‌ ‌కిట్‌…‌బిడ్డ పుట్టగానే కేసీఆర్‌ ‌కిట్‌ ఇస్తున్నాం..కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఉంటే ఎప్పుడైనా ఆలోచన చేసిందా. ఏప్రిల్‌ ‌మొదటి వారంలో 33 జిల్లాల్లో న్యూట్రిషన్‌ ‌కిట్‌ ‌ప్రారంభిస్తాం..అని తెలిపారు. ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన ప్రాంతం ఇది..తెలంగాణ రాకముందు ఇక్కడి భూములు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది.
అభివృద్ధి జరిగింది కాబట్టి ధరలు పెరిగాయి. కాంగ్రెస్‌, ‌బిజెపి పాలనలో ఎందుకు ధరలు పెరగలేదు.. రైతు విలువను కేసీఆర్‌ ‌పెంచారు కాబట్టి, రైతుల భూముల విలువ పెరిగింది. మంత్రం, మాటలతో పెరగలేదు. పని తీరుతో పెరిగింది. మహారాష్ట్ర, కర్ణాటక సర్పంచులు మమ్మల్ని కలపండి అని వినతులు ఇస్తున్నారు. మా పాలనకు ఇంతకంటే మంచి గీటురాయి ఏముంటుందని హరీష్‌ ‌రావు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌, ‌ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, నల్గొండ డీసీసీబీ చైర్మన్‌ ‌గొంగిడి మహేందర్‌ ‌రెడ్డి, జిల్లా పరిషత్‌ ‌ఛైర్మెన్‌ ‌సందీప్‌ ‌రెడ్డి, వైద్యారోగ్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *