మోగిన బడిగంటలు.. తెరుచుకున్న స్కూళ్లు

సెలవుల అనంతరం మళ్లీ పిల్లల బడిబాట
మౌలిక వసతులకు రూ.1100 కోట్లు కేటాయించామన్న మంత్రి పొన్నం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 12 : బడి గంటలు మోగాయి. వేసవి సెలవుల అనంతరం బుధవారం స్కూళ్లు తెరుచుకున్నాయి. నెలన్నర నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ చిన్నారుల కిలకిల రావాల ఆనందహేల గలగలా సవ్వడి చేసింది. అడుగులో అడుగు వేస్తూ బాల సైనికులు బడి ఒడిలోకి అడుగుపెట్టారు. వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలోని 41 వేల స్కూళ్లు, గురుకులాలు, వసతిగృహాలు బుధవారం తెరుచుకున్నాయి. దీంతో దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు తిరిగి బడిబాట పట్టారు. ఇన్నాళ్లు సెలవుల మజాను ఆస్వాదించి.. ఆటలు పాటలతో గడిపిన చిన్నారులంతా సోమవారం నుంచి చదువుల ప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు.

 

నేపథ్యంలో ప్రభుత్వ బడులను మరింత బలోపేతం చేసే, విద్యా ప్రమాణాలను  పెంపొందించేందుకు పాఠశాల విద్యాశాఖ పటిష్ఠ కార్యాచరణను సిద్ధం చేసింది. ఇదిలావుంటే ఎన్నికల కోడ్‌ ఉన్నప్పటికీ 26వేల ప్రభుత్వ పాఠశాలలకు రూ. 11వందల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. గత పదేళ్ళలో విద్య నిర్వీర్యం అయ్యిందని చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

 

ఉచిత పాఠ్య పుస్తకాలు యూనిఫాంలు పంపిణీ చేశామన్నారు. ఆలియా పాఠశాలలో కార్యక్రమంలో పాల్గొన మంత్రి ఆ పాఠశాలకు గొప్ప చరిత్ర ఉందని 1872లో స్థాపించారని తెలిపారు. విద్యార్థులు ఆసక్తితో చదవడంతో పాటు ఆటల్లోనూ రాణించాలని సూచించారు. రాజకీయలకు అతీతంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. మెగా డీఎస్సీ ద్వారా ఖాలీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు పొన్నం ప్రభాకర్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *