మేడ్చల్, ప్రజాతంత్ర, నవంబర్ 21 : రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మొదటి విడత ర్యాండమైజేష్ ప్రక్రియను జిల్లాలోని గుర్తింపు పొందిన ప్రజాప్రతినిధుల సమక్షంలో పూర్తి చేశామని, అదే విధంగా జిల్లాకు కేటాయించిన అదనపు బ్యాలెట్ యూనిట్ల పరిశీలన సైతం పూర్తయిందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, జిల్లాలోని గుర్తింపు పొందిన ఆయా రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలోని మల్కాజిగిరి, ఉప్పల్ శాసనసభ నియోజకవర్గాలకు అదనపుంగా బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు అవసరం కాగా అందులో మల్కాజిగిరి నియోజకవర్గానికి బ్యాలెట్ యూనిట్లు 1,096, కంట్రోల్ యూనిట్లు 23 చొప్పున, ఉప్పల్ నియోజకవర్గానికి బ్యాలెట్ యూనిట్లు 1,060, అలాగే కంట్రోల్ యూనిట్లు 15 కేటాయించి ర్యాండమైజేషన్ ప్రక్రియను సైతం పూర్తి చేసినట్లు తెలిపారు.కలెక్టరేట్లో బ్యాలెట్ యూనిట్ల, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను పరిశీలించిన అధికారులు రాజకీయ పార్టీల నాయకులు అనంతరం జిల్లా కలెక్టరేట్లో అదనపు బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్, జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ప్రత్యేకంగా పరిశీలించారు. జిల్లాకు వచ్చిన అదనపు బ్యాలెట్ యూనిట్ల మొదటి దశ పరిశీలన పూర్తయ్యిందని తెలిపారు. అక్కడ ఉన్న సిబ్బందికి అవసరమైన పలు సూచనలు చేశారు. అలాగే రాజకీయ పార్టీల నాయకులకు అన్ని వివరాలను స్పష్టంగా తెలియజెప్పారు.
మేడ్చల్ జిల్లాలో మొదటి విడత ర్యాండమైజేషన్





