- పెట్రో ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు
- పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీసిన కాంగ్రెస్ ఎంపిలు
- వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్
- దిల్లీ విజయ్ చౌక్ వద్ద రాహుల్ ఆధ్వర్యంలో ధర్నా
- మధ్యప్రదేశ్, చెన్నై, తెలుగు రాష్ట్రాల్లోనూ నిరసనలు
న్యూ దిల్లీ, మార్చి 31 : ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ మండిపడింది. పదిరోజుల్లో తొమ్మిదిసార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పెంచిన ధరలను పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇంధన ధరల పెంపు..సామాన్యుడికి పెను భారంగా మారిందని అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నాయకులతో కలిసి దిల్లీలోని విజయ్ చౌక్లో ఆయన ధర్నా నిర్వహించారు. అంతకుముందు పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రో ధరలపై చర్చించాలని డిమాండ్ చేశారు.
ధర్నాలో కెమెరాల్లో నీతులు వల్లిస్తూ.. దేశాన్ని దోచేస్తున్నారని మోదీ సర్కారుపై రాహుల్ గాంధీ విమర్శలకు దిగారు. చమురు ధరలు భగ్గుమంటుంటే ఫకీరుని ప్రశ్నించాని మోదీ గురించి అన్నారు. జోలె పట్టుకుని మాయమాటలతో దేశాన్ని దోచుకునేందుకు బయల్దేరారంటూ దుయ్యబట్టారు. ఆసియాలోని పలు దేశాల పెట్రో రేట్లు, భారత్లో ఉన్న చమురు ధరలను పోల్చుతూ రాహుల్ ఓ ట్వీట్ చేశారు. ‘పెట్రోల్ రేట్లను భారత కరెన్సీ ప్రకారం చూసుకుంటే..అఫ్గానిస్థాన్లో రూ.66.99, పాకిస్థాన్లో రూ.62.38, శ్రీలంకలో రూ.72.96, బంగ్లాదేశ్లో రూ.78.53, భూటాన్లో రూ.86.28, నేపాల్లో రూ.97.05, ఇండియాలో రూ.101.81గా ఉంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ధరల పెరుగుదల నుంచి భారత్కు విముక్తి కలగాలని హ్యాష్ ట్యాగ్ను ట్వీట్కు జత చేశారు. ఇక పెరుగుతున్న పెట్రో ధరలకు నిరసనగా ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద కాంగ్రెస్ ఎంపీలు ప్రదర్శన చేపట్టారు. ‘మెహంగాయి ముక్త్ భారత్ అభియాన్’ అనే పేరుతో నిరసనలకు దిగారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. పెరుగుతున్న పెట్రో ధరలు, ద్రవ్యోల్బణానికి నిరసనగా ఎంపీలు నినాదాలు చేశారు. పార్లమెంటులో ఇంధనం ధరలపై అడిగితే కేంద్రం జవాబు చెప్పట్లేదని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చమురు ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.గత పది రోజుల్లో తొమ్మిది సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నా, పేద, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారినా చలించడం లేదని రాహుల్ విమర్శలు గుప్పించారు. ఇంధన ధరలు పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో పేదవారి నుంచి ప్రభుత్వం డబ్బులు దోచుకుని పారిశ్రామికవేత్తలకు ఇస్తోంది. ఐదు రాష్టాల్ర ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన ధరలు పెరుగుతాయని నేను ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడదే జరుగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. ఇంధన ధరల పెరుగుదలకు నిరసిస్తూ.. మధ్యప్రదేశ్ మాజీ సిఎం కమల్నాథ్ ఆధ్వర్యంలో మహిళలు ధర్నాలకు దిగారు. గ్యాస్ సిలిండర్లకు దండలు వేస్తూ నిరసనలు చేపట్టారు. చెన్నైలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధరలను తగ్గించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతృత్వంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పెరుగుతున్న ధరలను అదుపులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నామని కాంగ్రెస్ నేత ఖర్గే అన్నారు.నిరసన కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు అధిర్ రంజన్ చౌదరి, మల్లికార్జున్ ఖర్గే, అభిషేక్ సింఘ్వీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు.




