- కొత్త జాబితాపై చర్యలు తీసుకోవాలి
- కేంద్ర ఎన్నికల సంఘానికి బిజెపి ఫిర్యాదు
న్యూ దిల్లీ, అక్టోబర్ 13 : మునుగోడు ఓటర్ జాబితాలో టీఆర్ఎస్ అవకతవకలకు పాల్పడిందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆరోపించారు. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన బిజెపి కేంద్ర ఎన్నికల సంఘ గడపకూడా తొకకింది. మునుగోడు ఓటర్ల జాబితాలోఅవకతవకలు జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నాయకుల బృందం ఫిర్యాదు చేసింది. కొత్తగా చేరిన వోటర్ల లిస్ట్ను పరిశీలించాలని ఈసీని కోరినట్లు చుగ్ తెలిపారు. మునుగోడులో కొత్తగా 25 వేల వోటర్లు చేరారని.. టీఆర్ఎస్సే ఫేక్ వోటర్లను చేర్చే కుట్రలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ దొంగ వోట్లు సృష్టిస్తుందని విమర్శించారు. మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ ప్రజల ఆత్మభిమానానికి, అవినీతి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు అని తరుణ్ చుగ్ అన్నారు.
ఫలితాన్ని ప్రభావం చేసేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వోటర్ లిస్ట్లో అవకతవకలకు పాల్పడిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవడంతోపాటు మూడేళ్లుగా ఒకే సెగ్మెంట్లో ఉన్న అధికారులను బదిలీ చేయాలని కోరారు. రాజగోపాల్పై కేటీఆర్ మాట్లాడిన మాటలు అర్ధరహితమన్నారు. టీఆర్ఎస్ మునుగోడులో 25 వేల నకిలీ వోటర్లను సృష్టించిందని మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఆరోపించారు. నకిలీ వోటర్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. గతంలో ఉప ఎన్నికల్లో 2వేల వోట్ల కన్నా ఎక్కువగా నమోదు కాలేదని.. కానీ ఇప్పుడు 25 వేల వోటర్లు కొత్తగా చేరారన్నారు. గత నాలుగేళ్ల నుంచి ఒకేచోట ఉన్న పోలీస్, రెవెన్యూ అధికారులను బదిలీ చేయాలని ఈసీని కోరినట్లు తెలిపారు.
మంత్రులు.. సెక్రెటరీలని మునుగోడుకు తీసుకొచ్చి అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. కేంద్ర బలగాలు, ఎన్నికల పరిశీలకులను మునుగోడుకు పంపాలని ఈసీని కోరామన్నారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో బీజేపీ గెలవడం ఖాయమన్నారు.


