పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు అభ్యర్థిగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ..తనపైన పూర్తి నమ్మకంతో మూడోసారి పటాన్ చెరు నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. సీఎం నమ్మకాన్ని వమ్ము చేయకుండా పటాన్ చెరు ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఇంట్లో సంక్షేమం.. ప్రతి ఇంటి ముంగిట అభివృద్ధి అన్న నినాదంతో ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.
పటాన్ చెరు లో అంబరాన్ని అంటిన సంబరాలు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి మూడోసారి బిఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. పటాన్ చెరు తోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా బి ఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, జిఎంఆర్ అభిమానులు, కార్యకర్తలు టపాకాయలు కాలుస్తూ మిఠాయిలు పంచుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.పటాన్ చెరులో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్ ఆధ్వర్యంలో సంబురాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్, కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, దశరథ్ రెడ్డి, భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


