మెదక్ జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంఖుస్థాపన
మెదక్,ప్రజాతంత్ర, జూన్5: పుట్టుక నుంచి చావుదాకా ఆలోచిస్తు విభిన్న కార్యక్రమాలు అమలుచేస్తున్నది తెలంగాణ ప్రభుత్వమని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖామంత్రి టి.హరీష్ రావు అన్నారు. సోమవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు ఓర్పు, సహనం ఎక్కువని వారి సంక్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి మహిళల కోసం పలు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని అన్నారు. నాడు ఊర్లో కెళ్లాలంటే గతుకుల రోడ్లు, వెళ్తే ఖాళీ బిందెలతో మహిళలు అడ్డుపడేవారని, కానీ నేడు నీళ్ల యుద్దాలు లేవు, కరెంటు గోస లేదని అన్నారు. వలస వెళ్లిన వారు తిరిగి ఊర్లకు వస్తున్నారని, నేడు కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పధకాల వళ్ళ ఊళ్ళకి కల వచ్చిందని అన్నారు. పేదింటి ఆడపిల్ల పెళ్ళికి ఒక లక్ష 116 ఇస్తున్నారని అన్నారు. వైద్యరంగాన్ని మెరుగుపరచి డయాగ్నస్టిక్ , టిఫా స్కానింగ్ వంటి అన్ని సౌకర్యాలు కల్పించడం వళ్ళ నేడు వందకు 81 శాతం ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు జరుగుతున్నాయని నేడు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ద్వారా సుస్పష్టమయ్యిందని అన్నారు.
నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న వారు నేడు నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు అని అంటున్నారని మంత్రి తెలిపారు. పుట్టిన బిడ్డకు ఇస్తున్న కేసీఆర్ కిట్ మాదిరే, తలి బిడ్డ ఆరోగ్యంగా బలంగా ఉండాలని ఈ నెల 16 నుండి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందజేయనున్నామన్నారు. ఆరోగ్యలక్ష్మి ద్వారా పాలు , గ్రుడ్లు అందజేస్తున్నామన్నారు. అదేవిధంగా ఈ నెలాఖరు నుండి గృహలక్ష్మి కార్యక్రమం ద్వారా సొంత జాగా కలిగిన వారికి ఇండ్లు నిర్మించుకొనుటకు 3 లక్షల రూపాయల ఆర్ధిక సహాయానానికి శ్రీకారం చుట్టనున్నామన్నారు మహిళా సమాఖ్య ఆర్ధిక బలోపేతానికి పట్టణంలోని వాణిజ్యప్రాంతమైన స్థలాన్ని కేటాయించామని, మంజీర పేర తమ ఉత్పత్తులను విక్రయించుకొనుటకు, అద్దెల ద్వారా ఆదాయం సముపార్జించుకొనుటకు భవనం తో పాటు దుకాణ సముదాయాల నిర్మించుకొనుటకు ప్రతిపాదించిన 50 లక్షలకు అదనంగా మరో 50 లక్షలు మొత్తం కోటి రూపాయలతో నిర్మిస్తామన్నారు.
ఈ సందర్భంగా 280 మహిళా సంఘాలకు 23 కోట్ల 51 లక్షల రూపాయల బ్యాంక్ లింకేజి చెక్కును మంత్రి మహిళా సమాఖ్యకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కాంప్ కార్యాలయం సమీపంలో నిర్మించిన డి.సి.సి.బి. బ్యాంకు భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మల్సీ శేరి సుభాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మేనేజర్ వేణుగోపాలాల్ రెడ్డి, డిఆర్ డి ఓ శ్రీనివాస్, ఆర్.డి.ఓ. సాయి రామ్, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


