వాతావరణశాఖ హెచ్చరిక
మూసీ పరివాహకంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 26 : రాష్ట్రంలో మరో మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. బుధవారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
గురువారం సైతం పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో మూసీకి భారీగా వరద నీరు వొచ్చి చేరుతుంది. దీంతో అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. చాదర్ ఘాట్, మూసారాంబాగ్ బ్రిడ్జిల వద్ద మూసీ ప్రవాహం ప్రమాదకరంగా మారింది. బాపూఘాట్, శంకర్ నగర్, చాదర్ ఘాట్, మూసారాంబాగ్ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ హెచ్చరించింది.




