విజయం చేకూర్చిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 04: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల పాలనను ఆశీర్వదిస్తూ… ఎనిమిది లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ శాసన సభ ఉప ఎన్నికలో విజయం చేకూర్చిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుపుతూ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. మీరు అందించిన ఈ ఆశీర్వాదాలు మా ఆత్మస్థైర్యాన్ని పెంచాయి అని పేర్కొంటూ..మరింత సమర్ధవంతమైన పాలన అందివ్వడానికి ఉత్సాహాన్నిచ్చాయి.
ప్రజల మద్ధతు కాంగ్రెస్ పార్టీకే ఉన్నదన్న విషయాన్ని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయి. కాంగ్రెస్ విజయం కోసం పని చేసిన కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. ఇది కార్యకర్తల విజయం. వారి శ్రమ, కష్టం పార్టీ గుర్తిస్తుంది. రేపటితో ఎన్నికల కోడ్ ముగుస్తోంది. మళ్లీ ప్రజా ప్రభుత్వ పాలన మొదలవుతుంది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అద్భుతమైన పాలన అందిస్తాం. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ప్రజా పాలన ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు తెలిపారు.



