‘మత్తు’లో ఎన్నికల ప్రచారం ..

ఎన్నికల వేళ మద్యం అమ్మకాలు పెరిగాయి. ఫలనా పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పార్టీలు మద్యం డంపులను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కార్యకర్తలు కూడా మందులేనిదే అడుగు బయటపెట్టడం లేదు. దీనికితోడు ఎండాకాలం కావడంతో బీర్లకు యమ గిరాకీ పెరిగింది. ఎన్నికల సమయం కావడంతో తెలుగు రాష్టాల్ల్రో విచ్చలవిడి మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఇకపోతే మద్యంపై అదుపు లేకుండా పోతోంది. ఇటీవల వరుసగా గంజాయి, మాదక ద్రవ్యాల పట్టివేత సంచలనంగా మారింది. పోలీసులు కఠిన చర్యలు తీసుకుని తనిఖీలు ముమ్మరం చేయడంతో డ్రగ్స్‌తో పాటు, గంజాయి పట్టుబడుతోంది. ఇకపోతే సులువుగా డబ్బు సంపాదించాలనుకున్న వారు ఈ వ్యాపారంలోకి దిగుతున్నారు. విస్తుగొలిపే విషయం ఏమంటే చదువుకున్న ఇంజనీరింగ్‌ విద్యార్థులు కూడా ఇందులో పడిపోతున్నారు. తేలికగా డబ్బు సంపాదన కోసం ఈ వ్యాపారాన్ని ఎంచుకుంటున్నారు. మరోవైపు మద్యం, గంజాయి వంటివి అందుబాటులో ఉండడంతో జులాయిలు అకృత్యాలకు తెగబడుతున్నారు.

ఎపిలో మద్యం ధరలు పెంచినా అమ్మకాలు ఆగడం లేదు. మద్యం ప్రధాన ఆదాయవనరు కావడంతో తెలుగు రాష్టాల్ల్రో అమ్మకాలపై అజమాయిషీ లేకుండా పోతోంది. బ్రాండ్‌ ఏదైనా డబ్బులు తెచ్చి పెడుతోంది. ఇటీవల గంజాయి కూడా విపరీతంగా పట్టుబడు తోంది. ఎంతగా స్వాధీనం చేసుకున్నా రవాణా ఆగడం లేదు. దీనికి కారణం మార్కెట్లో డిమాండ్‌ కారణంగా గంజాయి పెంపకానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎపితో పోలిస్తే తెలంగాణలో మద్యం అమ్మకాలు పెరిగాయి. మద్యం అమ్మకాలతో పాటు నేరాలు, ఘోరాలు కూడా పెరుగుతున్నాయి. మద్యం మత్తులోనే నేరాలు జరుగుతున్నట్లు పోలీసులు కూడా అంగీకరిస్తున్నారు. అత్యాచారలు, దొంగతనాలు, కిడ్నాప్‌లు ఇలా అనేక రకాలైన నేరాలకు మద్యం కారణం అవుతోంది. సంపూర్ణ మద్యనిషేధం విధిస్తామని అధికారంలోకి వచ్చిన ఎపి సిఎం జగన్‌ ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు. ఎన్నికల్లో కనీసం మాటమాత్రంగా అయినా మాట్లాడడం లేదు. మద్యం అమ్మకాలు లేకపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితిలో లేదు. దీంతో మద్యం అమ్మకాలను బాహాటంగానే ప్రోత్సహిస్తున్నారు. ఇష్టం వచ్చిన బ్రాండ్లతో అమ్మకాలు చేసి ఖజానా నింపుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కడా..ఇక్కడా అన్న తేడా లేకుండా నేరాలు పెరుగుతున్నాయి.

అంతెందుకు ఎన్నికల ప్రచార వేళ అమ్మకాలు పెరిగాయి. పార్టీ కార్యకర్తలకు మందు లేనిదే కాలు బయట పెట్టడం లేదు. ఏ పార్టీ అయినా మద్యం, ముక్క ఉండాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. తెలుగు రాష్టాల్ల్రో ఎన్నకల తేదీలు దగ్గర పడుతున్న వేళ..అన్ని పార్టీల  కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనాల్లో మద్యంతోపాటు ముక్క లేనిదే కదలడం లేదు. అత్యాచార ఘటనల్లో అనేకం కేవలం మద్యం కారణంగానే జరిగినట్లుగా గుర్తించారు. రేపిస్టులకు కఠిన శిక్షలు పడితే ఇలాంటి దారుణాలు చోటుచేసుకోవు. ప్రభుత్వం తాము కఠినంగా ఉన్నామని అనుకుంటే సరిపోదు. కఠినంగా ఉంటున్నారన్న సందేశం ప్రజల్లోకి వెళ్లగలిగేలా చేయాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు జరగవు. అలా చేయాలనుకున్న వారు కూడా జంకుతారు.అక్రమాలు, అకృత్యాలపై ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉండడం వల్లనే దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. అవి ఒక్క ఎపిలోనే జరుగుతున్నాయని చెప్పడానికి లేదు. తెలంగాణతో పాటు ఘనత వహించిన యూపిలో కూడా జరుగుతూనే ఉన్నాయి. గొప్పలుచెప్పుకుంటున్న కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉన్న కేరళలోనూ జరుగుతున్నాయి. రాక్షసులకు ప్రాంతం ఏదన్నది ముఖ్యం కాదు. రాక్షస ప్రవృత్తి ఉన్నవారు ప్రపంచమంతా నిండి ఉన్నారు. అలాంటి వారికి మద్యం తోడవుతోంది. వారికి కఠిన శిక్షలు అమలు చేయాల్సి ఉంది. విపక్షాలు కూడా అధికార పక్షాన్ని విమర్శించడం, రాజకీయ లబ్దికోసం నానాయాగీ చేయడం సరికాదు.

ఇలాంటి డ్రామాలు కట్టిపెట్టి సంఘటన జరిగినప్పుడు ఉమ్మడిగా ఎలా ముందుకు వెళ్లాలన్న ఆలోచనచేయాలి. ఇకపోతే ఇటీవల చోటు చేసుకుంటున్న సామూహిక అత్యాచార ఘటనలను చూస్తే సామాన్యలకు కూడా భయమేస్తోంది. బయటకు రావాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఉంది. చిన్న పిల్లలను కూడా వదలడం లేదు. కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధించి కొంత ఊరటను కలిగిస్తున్నాయి.  ఇలాంటి ఘటనలన్నింటికి మద్యపానం, మాదక ద్రవ్యాల వాడకం అన్నది ప్రధాన కారణమవుతోంది. ఆయా ఘటనల్లో నిందితులు పూటుగా మద్యం సేవించి.. ఆ మైకంలో ఉచ్ఛనీచాలు మరచి దుశ్చర్యలకు తెగబడుతున్నారు. మద్యం, గంజాయి విచ్చల విడిగా లభిస్తుండటంతో ఆ మైకంలో పైశాచికత్వానికి ఒడిగడుతున్నారు. అత్యాచార ఘటనల్లో అరెస్టవుతున్న నిందితుల్లో 60 శాతం మంది వరకూ మద్యం మత్తులో ఉన్నప్పుడే ఆ పైశాచిక చర్యకు పాల్పడుతున్నట్లు వెల్లడవుతోంది. మద్యం విచ్చలవిడిగా అమ్మడం,మాదక ద్రవ్యాల విషయంలో కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో పాలకులు గుర్తించాలి. మత్తులో పేట్రేగుతున్న ఉన్మాదులు..వరుసగా సామూహిక అత్యా చార ఘటనలకు పాల్పడుతున్న తీరును ఎలా ఎదుర్కోవాలన్న ఆలోచన చేయాలి.

అత్యాచార ఘటనల నిరోధానికి ఉమ్మడిగా పోరాడాలి. అనేక అత్యాచార ఘటనల్లో నిందితులు మద్యం మత్తులో రెచ్చిపోతు న్నారు. మద్యం, గంజాయి విచ్చలవిడిగా లభిస్తుండటంతో ఆ మైకంలో పైశాచికత్వాన్ని ప్రదర్శి స్తున్నారు. దీనికి ఫలానా వారు ప్రభుత్వంలో ఉన్నారు కనుక వారే బాధ్యులని నిందించలేం. ఎందుకంటే వారు చేసే అకృత్యాలకు అధికారపార్టీ వారు లైసెన్స్‌ ఇవ్వలేదు. వారు మద్యం మత్తులో చేసే ఘటనలు కనుక మద్యం అమ్మకాలపై ఆలోచన చేయాలి. ఇలాంటి ఘటనల్లో దోషులకు కఠిన శిక్షలు వేసేలా చేయాలి. మత్తులో ఉన్నవారికి విచక్షణ ఉండదు. తమ చర్యలపై నియంత్రణ ఉండదు. పశువాంఛ బయటపడే  క్రమంలో అమానుష చర్యలకు తెగబడుతుంటారు. అలాంటి సందర్భాల్లో బాధితులు ఎవరైనా వారిని ఎదిరించినా, వారి నుంచి తప్పించు కోవటానికి ప్రయత్నించినా మరింత రెచ్చిపోతారు. హింసాత్మక చర్యలకు దిగుతారు.

వీటిని  మానసిక నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. మద్యం మత్తులో ఉండే వ్యక్తికి అదే మైకంలో ఉన్న మరో ఇద్దరు, ముగ్గురు తోడైతే వారి పశుత్వానికి అడ్డూ అదుపు ఉండదు. అలాంటి సందర్భాల్లో వారికి నిస్సహాయంగా, ఎదురించలేని స్థితిలో మహిళలు ఎవరైనా కనిపిస్తే అఘాయిత్యానికి తెగబడతారు. తాను ఒక్కడినే కాదని.. తనతో పాటు మరి కొందరు ఉన్నారన్న భరోసాతో మరింతగా రెచ్చి పోతారు. తమవల్ల వారికి ఏమవుతుందో అన్న భయం కానీ..తరవాత తామేవుతామో అన్న ఆలోచనకానీ ఆ సమయంలో ఉండదు. మత్తులో ఉన్న వారిలో దూకుడు స్వభావం, విపరీత ధోరణి ఉంటుంది. ఇదే నేరాలకు దారి తీస్తోంది.విపరీత ప్రవర్తన, సమాజంపై ద్వేష భావం ఉండేవారికి మద్యం మత్తు తోడైతే అది తీవ్రమైన నేరాలకు కారణమవుతుంది. అందువల్ల మద్యం,గంజాయి లభ్యం కాకుండా అరికట్టే మార్గాలు ఆలోచించాలి.
అప్పుడే సమాజంలో ప్రశాంత వాతావరణం రాగలదు.
 ప్రజాతంత్ర డెస్క్‌  ! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *