- ఆప్ ఎంపీపై రాజ్యసభ ఛైర్మన్ ఆగ్రహం
- హౌస్లోని వెల్లోకి దూకి నినాదాలు
- సభ నుంచి సస్పెండ్ చేసిన రాజ్యసభ ఛైర్మన్
న్యూ దిల్లీ, జూలై 24 : మణిపూర్లో జరిగిన హింసాకాండపై పార్లమెంట్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగిన నేపథ్యంలో ఆప్ ఎంపీ సంజయ్సింగ్ను వర్షాకాల సమావేశాల మిగిలిన కాలానికి రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. హౌస్లోని వెల్లోకి దూకి నినాదాలు చేశారనే ఆరోపణతో రాజ్యసభ ఛైర్మన్ హెచ్చరించినప్పటికీ వెనక్కి వెళ్లేందుకు నిరాకరించినందుకు సంజయ్ సింగ్ను సస్పెండ్ చేశారు. సభలో అనుచిత ప్రవర్తన కారణంగా ఆప్ ఎంపీని వర్షాకాల సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్లు ఛైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రకటించారు. ఈ ఉదయం 11 గంటలకు రాజ్యసభ సమావేశం కాగానే ప్రతిపక్ష సభ్యులు మణిపుర్ అంశాన్ని లేవనెత్తారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే సభ వాయిదా పడింది. అనంతరం 12 గంటలకు రాజ్యసభ తిరిగి ప్రారంభమవ్వగా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు.
మణిపుర్ అంశంపై ప్రధాని మోడీ సభకు వచ్చి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు నినాదాలు చేశాయి. ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించేందుకు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్ అనుమతించారు. జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమిస్తున్నప్పుడు, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సభ వెల్లోకి దూకి నినాదాలు చేయడం ప్రారంభించారని ఆరోపించారు.
విపక్ష ఎంపీలు రూల్ 267 కింద చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నప్పుడు ప్రశ్నోత్తరాల సమయం కొనసాగడానికి అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సంజయ్ సింగ్ నిరసన వ్యక్తం చేశారు. వెనక్కి వెళ్లాల్సిందిగా ఛైర్మన్ ఆయనను హెచ్చరించారు. కానీ ఆయన నినాదాలు చేస్తూనే ఉన్నారు. రాజ్యసభలో సభా నాయకుడు పీయూష్ గోయల్ లేచి, ఇది రాజ్యసభ క్రమశిక్షణస ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని చైర్మన్ను కోరారు. దీంతో ఛైర్మన్ ఎంపీ సంజయ్ సింగ్ సస్పెన్షన్ను ప్రకటించారు.




